జెరూసలేం, అక్టోబర్ 12: హమాస్ మిలిటెంట్లను మట్టుబెట్టడమే లక్ష్యంగా గాజాపై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్ తాజాగా సిరియాను లక్ష్యంగా చేసుకున్నది. ఆ దేశ రాజధాని డమాస్కస్, మరో ప్రధాన నగరం అలెప్పోపై గురువారం దాడులకు దిగింది. రెండు నగరాల్లోని విమానాశ్రయాలపై బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ సేనల దాడుల కారణంగా రెండు విమానాశ్రయాల్లోని రన్వేలు భారీగా దెబ్బతిన్నాయి. దీంతో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. సిరియాకు చెందిన న్యూస్ ఏజెన్సీ సనా ఈ విషయాన్ని వెల్లడించింది. దాడుల విషయాన్ని జెరూసలేం పోస్ట్ ధ్రువీకరించింది.
ఇజ్రాయెల్ దాడులకు పాల్పడిన సమయంలో ఇరాన్ దౌత్యవేత్తల విమానం సిరియాలోని విమానాశ్రయంలో దిగాల్సి ఉన్నది. ఆ సమయంలోనే బాంబుల వర్షం కురిసింది. దీంతో ఇరాన్కు చెందిన మహన్ ఎయిర్ఫ్లైట్ అక్కడ ల్యాండ్ అవకుండానే వెనుదిరిగింది. ఇరాన్ లక్ష్యంగానే ఇజ్రాయెల్ దాడులు చేసినట్టు తెలుస్తున్నది. హమాస్ దాడుల వెనుక ఇరాన్ ఉందని ఇజ్రాయెల్ మొదట్నుంచి భావిస్తున్నది. దీంతో గురువారం సిరియా పర్యటనకు వచ్చిన ఇరాన్ దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడినట్టు పలువురు భావిస్తున్నారు. గాజాలోని హమాస్తో పాటు సిరియా నుంచి కూడా బుధవారం ఇజ్రాయెల్పై దాడులు జరిగాయి. సిరియాలో ఉన్న హమాస్ మద్దతుదారులు సరిహద్దుల్లోని ఇజ్రాయెల్ ప్రాంతాలపై దాడులకు పాల్పడ్డారు. దీంతో ప్రతీకార చర్యల్లో భాగంగానే ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడినట్టు చెబుతున్నప్పటికీ అసలు లక్ష్యం వేరే ఉండొచ్చనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. కాగా, ఇజ్రాయెల్ దాడులను సిరియా ఆర్మీ ఖండించింది. గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న మారణహోమాన్ని పక్కదారి పట్టించడానికే తమపై దాడులకు దిగినట్టు ఆ దేశ ఆర్మీ పేర్కొంది.
పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ను నామరూపాల్లేకుండా చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధమైంది. హమాస్ను కూకటివేళ్లతో సహా పెకిలించేందుకు సన్నాహాలు చేస్తున్నది. లక్షలాది మంది బలగాలతో గాజాలో అడుగుపెట్టి అక్కడి హమాస్ మిలిటెంట్లను ఏరివేయాలని ఇజ్రాయెల్ ప్రణాళికలు రచిస్తున్నది. భవిష్యత్తులోనూ హమాస్తో ముప్పు తప్పదని గ్రహించిన ఇజ్రాయెల్ ఆ గ్రూప్ కార్యకపాలను పూర్తిగా అంతమొందించేందుకు గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టేందుకు సిద్ధమవుతున్నది. ఇంటింటికి వెళ్లి మిలిటెంట్ల భరతం పట్టేందుకు ప్లాన్ చేస్తున్నది. అయితే రాజకీయ నిర్ణయం కోసం ఆ దేశ సైన్యం వేచిచూస్తున్నది..
అయితే గాజాలోకి ప్రవేశించి మిలిటెంట్లను మట్టుబెట్టాలని ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తున్నప్పటికీ.. అది అంత సులువు కాదని నిపుణులు చెబుతున్నారు. అత్యంత జనసాంద్రత ఉన్న ఉండే గాజా స్ట్రిప్లో ఇంటింటికి వెళ్లి మిలిటెంట్లను వెతికి హతం చేయడమనేది సాధ్యం కాకపోవచ్చని వారు పేర్కొంటున్నారు. గాజాలో ఉండే అండర్గ్రౌండ్ టన్నెళ్లు దీనికి ప్రధాన కారణం. మరోవైపు హమాస్ చేతిలో బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలు, అమెరికా తదితర ఇతర దేశాల పౌరులు ఇందుకు అవరోధంగా మారొచ్చని తెలుస్తున్నది. గ్రౌండ్ ఆపరేషన్పై ఇజ్రాయెల్ ఆచితూచి వ్యవహరించడానికి ఇది ఓ కారణమే.
గాజాను అష్టదిగ్బంధం చేసిన ఇజ్రాయెల్ పట్టువిడవడం లేదు. హమాస్ చేతిలో బందీలుగా ఉన్నవారిని సురక్షితంగా విడిచిపెట్టేంత వరకు నిత్యావసరాలు, నీరు, ఆహారం, ఇంధనం, కరెంటు సరఫరాను పునరుద్ధరించబోమని ఇజ్రాయెల్ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ హమాస్ను హెచ్చరించారు. ‘బందీలను విడిచిపెట్టేంత వరకు కరెంటు స్విచ్ ఆన్ చేయబోం. నీటి సరఫరా ఉండదు. ఇంధన ట్రక్కులు గాజాలోకి ప్రవేశించవు’ అని ఆయన తెలిపారు.
ఇజ్రాయెల్పై విచక్షణారహితంగా దాడులకు పాల్పడిన హమాస్ను అంత చేస్తామని ఆ దేశ ప్రధాని నెతన్యాహు తెలిపారు. ప్రతి ఒక్క హమాస్ మిలిటెంట్ను హతమారుస్తామని ఆయన పునరుద్ఘాటించారు. బుధవారం అర్ధరాత్రి దాటాక ఎమర్జెన్సీ వార్ టైమ్ క్యాబినెట్ను ఏర్పాటు చేసిన అంనతరం ఆయన మాట్లాడారు.
హమాస్ దాడులను అమెరికా అధ్యక్షుడు ఖండించారు. ఇటువంటి విచక్షణారహితమైన దాడులను చూస్తానని అనుకోలేదని ఆయన పేర్కొన్నారు. హోలోకాస్ట్ తర్వాత యూదులకు అత్యంత ఘోరమైన రోజు అని తెలిపారు.
అమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ ఆంటోని బ్లింకెన్ ఇజ్రాయెల్కు చేరుకున్నారు. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఈలి చోహెన్తో భేటీ అయ్యారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్, జోర్డాన్ రాజు అబ్దుల్లా -2లను ఆయన శుక్రవారం కలవనున్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ పరిస్థితులపై ఆయన చర్చించే అవకాశం ఉంది.
శాంతియుత మార్గంలో స్వతంత్ర, సార్వభౌమాధికార పాలస్తీనా ఏర్పాటుకు మద్దతిస్తామని, అయితే ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోమని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత మొదటిసారి భారత్ దీనిపై అధికారికంగా స్పందించింది. అరిందమ్ బాగ్చి గురువారం దీనిపై మాట్లాడారు.
ఇజ్రాయెల్లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఆపరేషన్ అజయ్ను చేపట్టిన భారత్ దాన్ని వేగవంతం చేసింది. 230 మంది భారతీయులతో కూడిన ప్రత్యేక విమానం గురువారం రాత్రి 9 గంటలకు బెన్ గురియన్ విమానాశ్రయం నుంచి బయలుదేరనున్నది. ఇందుకు భారత అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇజ్రాయెల్లో ఉన్న 18 వేల మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చేందుకు భారత ఎంబసీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
గాజాపై ఇజ్రాయెల్ విధించిన దిగ్బంధం వల్ల ఆ ప్రాంతంలో నివసిస్తున్న లక్షల మంది చీకట్లో మగ్గుతున్నారు. తిండి, నీరు దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. అనేకమంది గాజాలోని బేకరీల వద్ద లైన్లలో వేచి ఉన్నారు. అన్నివైపులా సరిహద్దులు మూసివేయడంతో లక్షల మంది పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు. ఇంధనం, కరెంటు లేకపోవడంతో అత్యవసర సేవలు నిలిచిపోయాయి. దవాఖానల్లో క్షతగాత్రులకు చికిత్స, అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడుతున్నది. ఆహారం, నీటి సరఫరా నిలిచిపోవడంతో మరింత మంది ఆకలిదప్పులతో మరణించే ప్రమాదం ఉందని పలు అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.