Israel-Gaza | గాజాలో పాలస్తీనా వాసులకు ప్రత్యేకించి యుద్ధ బాధితుల అభివృద్ధి, పునరావాసం కోసం ఐరాస అనుబంధ ఐక్యరాజ్య సమితి పాలస్తీనా శరణార్థుల పునరావాస పనుల సంస్థ (యూఎన్ఆర్డబ్ల్యూఏ) సాయంపై ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కాట్జ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ముగిసిన తర్వాత గాజాలో `యూఎన్ఆర్డబ్ల్యూఏ` కార్యకలాపాలు నిలిపేయాలని కోరనున్నట్లు ఎక్స్ (మాజీ ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు. అంతేకాదు.. యూఎన్ఆర్ డబ్ల్యూఏ నాయకత్వాన్ని మార్చాలని కూడా డిమాండ్ చేశారు. శాంతి, డెవలప్ మెంట్ కోసం పని చేసే సంస్థలను ఏర్పాటు చేయాలని కోరరాు. ఇందుకోసం అమెరికా, ఈయూ దేశాల మద్దతు కూడగడతామని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ మంత్రి వ్యాఖ్యలపై హమాస్ తీవ్రంగా మండిపడింది. పాలస్తీనియన్ల రక్షణ కోసం పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థలను భయపెట్టడానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తున్నదని ఆరోపించింది.
గతేడాది అక్టోబర్ ఏడో తేదీన హమాస్ జరిపిన మారణ హోమంలో కొందరు `యూఎన్ఆర్డబ్ల్యూఏ` ఉద్యోగుల పాత్ర ఉన్నదని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఈ విషయమై తమ వద్ద గల ఆధారాలను సంబంధిత సంస్థ ఉన్నతాధికారులకు అందజేసింది. దీంతో హమాస్ దాడిలో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న ఉద్యోగులను యూఎన్ఆర్డబ్ల్యూఏ తొలగించింది. మానవతా సాయం అందించే తమ సంస్థను రక్షించుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని యూఎన్ఆర్డబ్ల్యూఏ కమిషనర్ జనరల్ ఫిలిప్ లజారిని తెలిపారు.
యూఎన్ఆర్డబ్ల్యూఏ నుంచి ఈ ప్రకటన రాగానే ఈ సంస్థకు అమెరికా అదనపు నిధులు మంజూరు చేయకుండా నిలిపేసింది. పూర్తిస్థాయిలో సమీక్షించాకే ఆర్థిక సాయంపై ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. హమాస్ దాడిలో సుమారు 12 మంది యూఎన్ఆర్డబ్ల్యూఏ ఉద్యోగులకు సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఈ సంస్థకు ఆస్ట్రేలియా, కెనడా కూడా నిధులు విడుదల చేయకుండా నిలిపేశాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ మంత్రి కాట్జ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.