న్యూఢిల్లీ : తాలిబన్ నేతలు ముల్లా అబ్ధుల్ ఘనీ బరాదర్, హక్కానీ మద్దతిస్తున్న గ్రూపుల మధ్య ఘర్షణల నేపధ్యంలో పాకిస్తాన్ ఐఎస్ఐ చీఫ్ ఫయిజ్ హమీద్ కాబూల్ చేరుకున్నారు. హక్కానీ సహా పలు తాలిబన్ వర్గాలు తమ నేతగా హైబతుల్లా అఖుంద్జదాను అంగీకరించడం లేదని సమాచారం. మరోవైపు సెప్టెంబర్ 3న తమ ప్రభుత్వం ఏర్పాటవుతుందని తాలిబన్లు ప్రకటించినా దానిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకుండానే ఆరోజు గడిచిపోయింది. కాబూల్లో రాజకీయ నేతగా బరాదర్ ఎదుగుదలలోనూ జాప్యం నెలకొంది.
ఈ జాప్యంతో పాటు హమీద్ అత్యవసరంగా కాబూల్కు చేరుకోవడం తాలిబన్లలో భారీ సంక్షోభం నెలకొనే దిశగా సంకేతాలు పంపుతోందని చెబుతున్నారు. తాలిబన్లలో విభేదాలు తీవ్రతరం కావడంతోనే ఐఎస్ఐ చీఫ్ హమీద్ కాబూల్ వచ్చారని భావిస్తున్నారు. హమీద్ కాబూల్ అత్యవసర పర్యటనతో తాలిబన్లు కేవలం ఐఎస్ఐ తోలుబొమ్మలని వెల్లడైన క్రమంలో తాలిబన్లను ప్రపంచం ఎందుకు గుర్తించాలని, వారితో ఎందుకు సంప్రదింపులు జరపాలని అమెరికన్ విధానకర్తలు ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు అమెరికాకు తాలిబన్లలో పరపతి ఉందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్ధాన్లో 940 కోట్ల డాలర్ల నిధులపై నియంత్రణ కోసం హమీద్ భ్రమల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఆప్ఘనిస్ధాన్ను అణిచివేస్తూ, ప్రజాస్వామిక దేశంగా మనగలగాలనే పాకిస్తానీల ఆశను అణగార్చినందుకు హమీద్ను ఉగ్రవాదిగా, ఐఎస్ఐని ఉగ్ర సంస్థగా పరిగణించేలా అమెరికా విధానం ఉండటం మేలని పేర్కొన్నారు.