Iran President : ఇరాన్ (Iran) లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలపై అక్కడి భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపి హింసాత్మకంగా అణచివేసినందుకు ఆ దేశ అధ్యక్షుడు (Iran President) మసౌద్ పెజెష్కియాన్ (Masoud Pezeshkian) ఒకింత బాధను వెలిబుచ్చారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. అణచివేతలో కుటుంబసభ్యులను కోల్పోయిన వారు, గాయపడిన వారు అనుభవించిన బాధ తనకు తెలుసని అన్నారు.
దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని కట్టడి చేయలేకపోయినందుకు ప్రభుత్వం సిగ్గుపడుతోందని పెజెష్కియాన్ తెలిపారు. అయితే భద్రతాబలగాలు చేసిన దాడుల్లో అక్కడి నిరసనకారులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన పేర్కొనలేదు. పాశ్చాత్య దేశాలు చేసిన తప్పుడు ప్రచారాలవల్ల దేశంలో నిరసనలు చెలరేగుతున్నాయని తెలిపారు. తమ ప్రభుత్వం ఎప్పటికీ ప్రజలతో ఘర్షణలు, ఇతర దేశాలతో యుద్ధాలు కోరుకోదని అన్నారు.
తాము పెద్ద మొత్తంలో అణ్వాయుధాలు తయారు చేస్తున్నామని ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని మసౌద్ పెజెష్కియాన్ స్పష్టంచేశారు. శాంతియుత ప్రయోజనాల కోసం అణుశక్తిని ఉపయోగించుకునే చట్టబద్ధమైన హక్కులను మాత్రమే తాము కాపాడుకుంటామని తెలిపారు. చర్చలతో అన్ని సమస్యలను పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మరోవైపు అమెరికా చేస్తున్న డిమాండ్లకు ఇరాన్ ఎట్టిపరిస్థితుల్లోనూ లొంగదని స్పష్టంచేశారు.