Iran vs US : అమెరికా (USA), ఇరాన్ (Iran) దేశాల మధ్య పరస్పర దాడులతో పశ్చిమాసియా (West Asia) లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో వాణిజ్య నౌకపై ఇరాన్ చేసిన దాడికి ప్రతీకారంగా అమెరికా సైన్యం ఇరాన్పై మరోసారి భీకర దాడులకు పాల్పడింది. కేవలం వారం రోజుల వ్యవధిలో ఇరాన్పై అమెరికా దాడులకు దిగడం ఇది మూడోసారి. దీన్ని బట్టి అక్కడి పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇరాన్లోని పలు లక్ష్యాలపై అమెరికా బలగాలు దాడులు చేశాయి. అంతకుముందు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీసీ).. హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ‘ఎమ్/వి జిఎఫ్ఎస్ గెలాక్సీ’ అనే వాణిజ్య నౌకపై దాడి చేసింది. ఈ ఘటనలో నౌక ఇంజిన్ రూమ్ తీవ్రంగా దెబ్బతిని మంటలు చెలరేగాయి. నౌకా సిబ్బందిలో ఒకరు అదృశ్యమయ్యారు. వాణిజ్య నౌకలపై దాడులు చేసే ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఈ దాడులు జరిపినట్లు సెంట్కామ్ స్పష్టంచేసింది.
ఈ దాడులపై అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇరాన్ తప్పుడు నిర్ణయం తీసుకుంటోందని, ఇప్పుడు దానికి తగిన మూల్యం చెల్లించుకుంటోందని తీవ్రంగా హెచ్చరించారు. కాగా, అమెరికా దాడులకు కొన్ని గంటల ముందే ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే అత్యంత కీలక వాణిజ్య రవాణా మార్గమైన హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాంతంలో అమెరికా జోక్యం ఆగిపోయే వరకు ఏ అంతర్జాతీయ నౌకను అనుమతించేది లేదని ఐఆర్జీసీ నేవీ స్పష్టంచేసింది.
దశాబ్దాలుగా ఇది అంతర్జాతీయ జలమార్గంగా ఉన్నప్పటికీ తమ సార్వభౌమ ప్రాంతంగా పరిగణిస్తూ నౌకల నుంచి పన్నులు వసూలు చేస్తామని ఇరాన్ వాదిస్తోంది. అమెరికా దాడుల తర్వాత ఇరాన్లోని ఖేష్మ్ ద్వీపం, బందర్ అబ్బాస్, సిరిక్లలో భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ పరిణామాలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందిస్తూ అమెరికానే తమ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఇరాన్ చమురు అమ్ముకోవడానికి ఇచ్చిన మినహాయింపులను అమెరికా ఏకపక్షంగా రద్దు చేయడమే దీనికి కారణమని అరాగ్చీ అన్నారు. అయితే హర్మూజ్ జలసంధిలో ఇరాన్ దాడులకు పాల్పడటంవల్లే చమురు మినహాయింపులు రద్దు చేశామని అమెరికా వాదిస్తోంది. ఈ పరస్పర దాడులు, ఆరోపణలతో పశ్చిమాసియాలో ఉద్రికత్తలు పెరుగుతున్నాయి.