ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. పాకిస్థాన్లోని జైష్-అల్-అదల్ ఉగ్రవాద సంస్థ స్థావరాలపై మంగళవారం దాడి చేసినట్లు తెలిపింది. ఈ దాడికి ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను ఉపయోగించింది. అయితే ఇరాన్ దాడులను పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. దాడిలో ఇద్దరు అమాయక పిల్లలు చనిపోయారని, మరో ముగ్గురు బాలికలు గాయపడ్డారని వెల్లడించింది. ఇది పాకిస్థాన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని, ఈ దాడి తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించింది.
గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్లకు మధ్య జరుగుతున్న యుద్ధం మరింత విస్తరించే అవకాశం ఉన్న క్రమంలో ఈ దాడులు చోటుచేసుకున్నాయి. మరోవైపు సోమవారం ఇరాకీ నగరం ఇర్బిల్లోని యుఎస్ కాన్సులర్ కాంపౌండ్కు సమీపంలో ఉన్న ఇజ్రాయెల్ గూఢచారి ప్రధాన కార్యాలయం, తీవ్రవాద ఇస్లామిక్ స్టేట్ గ్రూపుతో సంబంధం ఉన్న లక్ష్యాలపై కూడా ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ దాడికి ఇరాక్ కూడా ఖండించింది. ఇరాక్ సార్వభౌమాధికారానికి ఈ దాడి భంగకరమని, దాడిలో అనేక మంది అమాయక పౌరులు మరణించారని తెలిపింది.
2023 డిసెంబర్లో ఇరాన్లోని పోలీస్ స్టేషన్పై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన పాకిస్థాన్ను ఇరాన్ మందలించింది. ఇరాన్లోని సిస్తాన్-బలూచిస్థాన్ ప్రావిన్స్లోని రాస్క్లోని పోలీస్ స్టేషన్పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ దాడిలో 11 మంది భద్రతా సిబ్బంది మరణించారు. అప్పటి నుంచి ఇరాన్ పాకిస్థాన్ను లక్ష్యంగా చేసుకుంది. అదేవిధంగా పాకిస్థాన్కు తన సరిహద్దులపై నియంత్రణ లేదని విమర్శించింది.