వాషింగ్టన్: పశ్చిమాసియాలో పరిస్థితి భీకరంగా మారింది. అమెరికా-ఇజ్రాయెల్ దళాలు శనివారం ఇరాన్(Iran)పై దాడి చేసిన నేపథ్యంలో పరిస్థితి అదుపు తప్పింది. అయితే ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్.. గల్ఫ్ దేశాలపై కక్ష కట్టింది. దీంతో ఇరాన్ ఏకాకిగా మారినట్లు అయ్యింది. ప్రతిదాడులకు దిగిన ఇరాన్ను వదిలిపెట్టేది లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాతో చర్చలు నిర్వహించేందుకు ఇరాన్ తిరస్కరించినట్లు తెలుస్తోంది.
ఇరాన్పై జరిగిన దాడుల్లో యూకే పాత్ర లేదని ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు. అయితే అమెరికా చేసిన ఓ రిక్వెస్ట్కు బ్రిటన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇరాన్ క్షిపణలను తిప్పికొట్టేందుకు బ్రిటీష్ బేస్ను వాడుకోవాలని అమెరికా ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని స్టార్మర్ స్పందించారు. శనివారం టెహ్రాన్పై జరిగిన దాడిలో సుప్రీంనేత అయతుల్లా అలీ ఖమేనీ మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు అనేక మంది కీలక నేతలు హతమయ్యారు.
అమెరికా-ఇజ్రాయల్ నిర్వహించిన దాడులను రష్యా ఖండించింది. రాజకీయ హత్యలకు పాల్పడడం సరికాదు అని రష్యా పేర్కొన్నది. మరో వైపు ఇవాళ అమెరికా జరిపిన దాడుల్లో.. టెహ్రాన్లో ఉన్న రష్యా టుడే కార్యాలయం సమీపంలో ఓ బాంబు పడినట్లు తెలుస్తోంది. దీంతో ఆర్టీ అరబిక్ ఆఫీసులో ఉన్న సిబ్బందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.