Iran : ఒక పక్క యుద్ధ సమయంలోనూ ఇరాన్ తన దేశంలో అణచివేత ఆపడం లేదు. ఇజ్రాయెల్కు గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై ఇద్దరు వ్యక్తుల్ని ఇరాన్ ప్రభుత్వం ఉరితీసింది. శనివారం ఈ ఘటన జరిగింది. సెంట్రల్ ఇస్ఫాహాన్ ప్రావిన్స్ పరిధిలోని నటాంజ్ న్యూక్లియర్ సైట్ వద్ద యగౌబ్ కరింపోర్, నాజర్ బకర్జాదే అనే ఇద్దరు వ్యక్తుల్ని ఉరితీసినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ ఇద్దరూ ఇజ్రాయెల్కు ఇరాన్కు సంబంధించిన రహస్య సమాచారం చేరవేశారని ఇరాన్ ఆరోపించింది. ఇజ్రాయెల్కు చెందిన గూఢచార సంస్థ మొసాద్.
ఈ సంస్థకు ఈ ఇద్దరూ ఇరాన్ ప్రభుత్వానికి సంబంధించిన వివరాలు, కీలక ప్రదేశాలు, మత సంబంధమైన ప్రదేశాలతోపాటు న్యూక్లియర్ ప్లాంట్కు చెందిన సమాచారాన్ని చేరవేశారని ఇరాన్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ సమాచారాన్ని వీరు సేకరించి, మొసాద్ అధికారులకు అందజేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నేరానికి గాను ఇరాన్ కోర్టు ఇద్దరికి మరణశిక్ష విధించింది. దీంతో శనివారం ఇరువురిని ఉరితీసింది. రెండు వారాల వ్యవధిలోనే ఇలా స్థానికుల్ని ఉరితీయడం ఇది రెండోసారి. గత ఏప్రిల్ 20న కూడా మొహమ్మద్ మాసౌమ్ షాహి, హమెద్ వాలిది అనే ఇద్దరు వ్యక్తుల్ని కూడా ఇదే గూఢచర్యం కింద ఇరాన్ ప్రభుత్వం ఉరితీసింది. వీరు ఇరాక్తోపాటు విదేశాల్లో శిక్షణ పొంది, ఇరాన్లో గూఢచర్యం చేస్తూ, మొసాద్కు సమాచారం అందిస్తున్నారని ఇరాన్ ఆరోపించింది.
అయితే, వీరిపై వచ్చిన ఆరోపణల్ని వీరు పని చేసే మొజొహెదిన్ సంస్థ ఖండించింది. మరోవైపు ఇరాన్లో అమలవుతున్న మరణ శిక్షలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. గత ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇరాన్ ప్రభుత్వం కనీసం 21 మందిని ఉరితీసిందని పేర్కొంది. అలాగే, భద్రతా కారణాలతో 4,000 మందికిపైగా అరెస్టు చేసినట్లు తెలిపింది. కానీ, ఈ విషయంలో ఇరాన్ నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.