కాబూల్ : తాలిబాన్ వశం అనంతరం ఆఫ్ఘనిస్తాన్లో ద్రవ్యోల్బణం (Inflation @ Afghanistan) రెక్కలు విచ్చుకున్నది. ఇక్కడి బ్యాంకులు, ఏటీఎంలు మూతపడటంతో నగదు కొరతను ఎదుర్కొంటున్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశంలోని చుక్కలతో పోటీ పడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు గత రెండు నెలలుగా జీతాలు లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. తాలిబాన్ చేతిలో చనిపోకుండా ఉండేందుకు ఎందరో దేశం దాటిపోయేందుకు కాబూల్ విమానాశ్రాయానికి పోటెత్తారు. నిత్యావసరాల సరఫరా లేకపోవడంతో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
కాబూల్ విమానాశ్రయంలో ఒక్క వాటర్ బాటిల్ రూ.3 వేలు పలుకుతుండగా.. ప్లేట్ భోజనానికి రూ.7 వేలకు పైగా చెల్లించాల్సి వస్తున్నది. డబ్బు ఉన్నవారు మాత్రమే ఇలాంటి వాటి జోలికెళ్తుండగా.. లెక్కకుమిక్కిలి మంది పస్తులుంటున్నారు. అధిక ద్రవ్యోల్బణంతోపాటు పెరుగుతున్న పేదరికం గురించి నిపుణులు హెచ్చరిస్తున్నారు. విదేశాల నుంచి తమ బంధువులు పంపే నగదు బదిలీ నిలిపివేయడంతో ఇక్కడి వారికి చిక్కులు మరిన్ని పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లోని ఏటీఎంలు నగదు లేక వెక్కిరిస్తున్నాయి. బ్యాంకులతోపాటు కాబూల్లోని ప్రధాన సరాయ్ షాజాదా ఫైనాన్షియల్ ఎక్స్ఛేంజ్ మూసివేయడంతో తాలిబాన్ అధికారాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి దేశం వరుసగా ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నది. నగదు విలువ పూర్తిగా పడిపోవడంతో అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. విమానాశ్రయంలో డాలర్లను మాత్రమే అనుమతించడంతో సాధారణ ప్రజలు ఆకలితో అలమటించిపోతున్నారు.
ఆఫ్ఘన్ సంక్షోభం మధ్య, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం బుధవారం ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం, ‘ప్రతి ముగ్గురు ఆఫ్ఘన్లలో ఒకరు.. అంటే దాదాపు 1.40 కోట్ల మంది ఆకలితో ఉన్నారు. 20 లక్షల మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. వీరికి తక్షణ సహాయం అవసరం. పంటలు లేవు, వర్షాలు లేవు, తాగునీరు లేదు, ప్రజలు పేదరికంలో జీవిస్తున్నారు’ అని నివేదిక పేర్కొన్నది.
బ్రిటీష్ వారిని దోచుకున్న విప్లవకారులు
గుండె వైఫల్యం ప్రమాదమా..? ఇలా గట్టెక్కొచ్చు..!
నిన్నటి వరకు మంత్రి.. నేడేమో పిజ్జా డెలివరీ బాయ్..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..