మన పొరుగు దేశం శ్రీలంకలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే పెట్రోలు, కిరోసిన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో వీటి ధరలు మరింత పెరగకముందే సాధ్యమైనంత కొనేయాలన్న తపనలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా శ్రీలంక రాజధాని కొలంబోలో పెట్రోలు కోసం క్యూలో నిలబడి ఒకరు, కిరోసిన్ కోసం క్యూలో నిలబడి మరొకరు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.
వీరిద్దరూ 70 ఏళ్లు పైబడిన వృద్ధులే కావడం గమనార్హం. ప్రస్తుతం శ్రీలంకలో పెట్రోలు, కిరోసిన్ షాపుల ముందు భారీ క్యూలు నెలకొన్నాయి. ప్రజలు గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. దీనికితోడు విపరీతమైన కరెంటు కోతలతో శ్రీలంక ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బంది కరంగా ఉంది. దేశంలో చమురు నిల్వలు తగ్గిపోవడంతో దేశంలోని ఏకైక ఇంధన రిఫైనరీలో కూడా పని ఆపేశారు.
ఈ విషయాన్ని ఆదివారం నాడు శ్రీలంక పెట్రోలియం జనరల్ ఎంప్లాయీస్ యూనిస్ అధ్యక్షుడు అశోక రణవాల వెల్లడించారు. ఇక్కడ గ్యాస్ ధరలు భారీగా పెరగడంతో మధ్యతరగతి కుటుంబాలు కిరోసిన్ వాడకం మొదలుపెట్టాయి. ఇక్కడ ద్రవ్యోల్బణం ఆసియాలో ఏకంగా 15.1 శాతానికి చేరినట్లు ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి.