Indonesia | ఇండోనేషియాయ (Indonesia)లో అగ్నిపర్వతం బద్ధలైంది (volcano erupts). సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న స్టాటోవోల్కానో మౌంట్ రువాంగ్ (Ruang mountain) అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. 24 గంటల వ్యవధిలోనే సుమారు 5 సార్లు విస్ఫోటనం చెందినట్లు ఆ దేశ జియోలాజికల్ ఏజెన్సీ తెలిపింది. దీంతో కిలోమీటర్ల మేర లావా ఏరులై పారుతున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో అక్కడ సునామీ (tsunami) హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ ఇచ్చింది.
అగ్నిపర్వతం నుంచి విరజిమ్ముతున్న పొగ, బూడిద సమీప ప్రాంతాలను కమ్మేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. లావా పెద్ద ఎత్తున సమీప ప్రాంతాలకు చేరుతుండటంతో అధికారులు అలర్ట్ జారీ చేశారు. 725 మీటర్ల (2,378 అడుగులు) రుయాంగ్ అగ్నిపర్వతం నుంచి సుమారు 6 కిలోమీటర్ల (3.7 మైళ్ళు) మేర దూరంగా ఉండాల్సిందిగా స్థానికులను అధికారులు కోరారు.
మరోవైపు విస్ఫోటనం చెందిన అగ్నిపర్వతంలోని కొంత భాగం సముద్రంలోకి కూలిపోయి సునామీ వచ్చే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు స్థానికులకు పలు సూచనలు చేశారు. వెంటనే ఆ ప్రాంతాన్ని విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని హెచ్చరించారు. మరోవైపు ఆ ప్రాంతంలోని దాదాపు 11 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వారందరినీ సులవేసి ద్వీపంలోని మనాడోకు సమీప నగరానికి పడవల ద్వారా తరలిస్తున్నారు.
కాగా, ఇండోనేషియాలో అగ్నిపర్వతాల విస్ఫోటనాలు సర్వసాధారణమే. 2018లో అనక్ క్రకటౌ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడం వల్ల సుమత్రా, జావా తీరాల వెంబడి సునామీ వచ్చింది. అగ్నిపర్వతంలోని భాగాలు సముద్రంలోపడిపోయాయి. ఈ ఘటనలో సుమారు 500 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
Also Read..
UNSC | భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం.. ఎలాన్ మస్క్ ప్రతిపాదనపై స్పందించిన అమెరికా
Toshiba | తోషిబాలో 5 వేల మందిపై వేటు..!