Flight | ఇండోనేషియాలో ఒక విమానం ప్రయాణిస్తున్నప్పుడు ఒకే టైంలో ఇద్దరు ప్రయాణికులు నిద్ర పోవడంతో ఆ విమానం దారి తప్పింది. దాదాపు 30 నిమిషాల తర్వాత ప్రధాన పైలట్ మేల్కొని వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవడంతో పెను ముప్పు తప్పింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఇండోనేషియా రవాణాశాఖ సదరు పైలట్లపై సస్పెన్షన్ వేటు వేసింది. గత జనవరి 25న జరిగిన ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగు చూసింది.
బాతిక్ ఎయిర్వేస్ సంస్థ విమానం నలుగురు సిబ్బంది, 153 మంది ప్రయాణికులతో సులవేసి నుంచి దేశ రాజధాని జకార్తాకు ప్రయాణమైన కొద్ది సేపటికే కో పైలట్ అనుమతితో ప్రధాన పైలట్.. అటుపై కో పైలట్ నిద్రలోకి జారుకున్నారు. వారిని సంప్రదించేందుకు జకార్తలోని ఎయిర్ కంట్రోల్ సెంటర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
దాదాపు 28 నిమిషాల తర్వాత మేల్కొన్న ప్రధాన పైలట్.. తన కో పైలట్ కూడా నిద్ర పోతున్నాడని గమనించాడు. తమ విమానం నిర్ణీత మార్గంలో వెళ్లడం లేదని గుర్తించి.. కో పైలట్ ను నిద్ర లేపాడు. వెంటనే ఎయిర్ కంట్రోల్ కాల్ సెంటర్ ను సంప్రదించి విమానాన్ని సరైన మార్గంలోకి తీసుకుని జకార్తాలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.