ఐరాసలో ఇమ్రాన్కు భారత అధికారిణి దీటుగా జవాబు
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితిలో పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ కశ్మీర్ సమస్యను ప్రస్తావించడంపై భారత్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఓవైపు దొమ్మీకి దిగి మంటలు పెడుతుందని, మరోవైపు మంటలను ఆర్పే అగ్నిమాపక దళంలా పోజు పెడుతుందని దుయ్యబట్టింది. శుక్రవారం ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధిసభలో భారత ప్రథమ కార్యదర్శి స్నేహా దూబే మాట్లాడుతూ.. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్ము, కశ్మీర్, లఢక్ భారత్లో అంతర్భాగమని తేల్చిచెప్పారు. పాక్ ఆక్రమణలో ఉన్న భాగాలు కూడా అందులోనివేనని స్పష్టం చేశారు. పాక్ తన ఆక్రమణలో ఉన్న భారత్ భూభాగాల నుంచి వైదొలగాలని తాఖీదు ఇచ్చారు. ఉగ్రవాద బాధితురాలిగా పదేపదే చెప్పుకునే పాకిస్థాన్ నిజానికి ఉగ్రవాద పోషకురాలని ధ్వజమెత్తారు. ఒసామా బిన్ లాడెన్ పాక్ గడ్డమీద ఆశ్రయం పొందిన విషయం ఎవరూ మరచిపోలేదని గుర్తుచేశారు. కాగా, దూబే చూపించిన వాదనా పటిమకు నెటిజన్లు జేజేలు పలుకుతున్నారు.