సాన్ జోస్: మాజీ కోడలిని కాల్చిచంపిన కేసులో భారత సంతతికి చెందిన ఓ అమెరికన్ వృద్ధుడు అరెస్టయ్యాడు. సెప్టెంబర్ 30న కాలిఫోర్నియా రాష్ట్రం సాన్ జోస్ సిటీలోని వాల్మార్ట్ స్టోర్ పార్కింగ్ ప్రదేశంలో గుర్ప్రీత్ కౌర్ అనే మహిళ హత్యకు గురైంది. వాల్ట్మార్ట్ స్టోర్లోనే పనిచేసే ఆమె పార్కింగ్ ఏరియాలో తూటా గాయాలతో విగతజీవిగా పడివుండటాన్ని సహోద్యోగులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మృతురాలి కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మధ్యాహ్నం ఒంటిగంటకు గుర్ప్రీత్ కౌర్ తన మేనమామకు ఫోన్ చేసినట్లు గుర్తించారు. ఫోన్ మాట్లాడుతూ కౌర్ పార్కింగ్ ఏరియాలోకి వెళ్లగా.. మధ్యాహ్నం 1:17 గంటలకు ఓ ట్రక్కు నడుపుకుంటూ కౌర్ మాజీ మామ (మాజీ భర్త తండ్రి) పార్కింగ్లోకి ప్రవేశించినట్లు సీసీ ఫుటేజీలో కనిపించింది. 1:23 గంటలకు ఆయన ట్రక్కు కోడలి కారు సమీపంలో ఉంది. 1:30 గంటలకు బయటికి వెళ్లిపోయింది.
అయితే, హత్య చేసిన దృశ్యాలు సీసీ టీవీలో కనిపించలేదు. దాంతో కౌర్ మేనమామను విచారించగా.. తనతో ఫోన్ మాట్లాడుతూ వాళ్ల మాజీ మామ పార్కింగ్లోకి వచ్చాడని భయపడుతూ చెప్పినట్లు తెలిపాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె అరుపు వినిపించిందని, ఫోన్ డిస్కనెక్ట్ అయ్యిందని చెప్పాడు. ఆ సమాచారం ఆధారంగా గాలింపు చేపట్టి.. ఎట్టకేలకు ఫ్రెస్నో సిటీలోని తన నివాసంలో ఉన్న కౌర్ మాజీ మామ సీతల్ సింగ్ దొసాంజ్ (74)ని అదుపులోకి తీసుకున్నారు.
నేరం అంగీకరించిన నిందితుడు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. అతని కుమారుడితో గతంలో గుర్ప్రీత్ కౌర్కు వివాహమైంది. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని వేర్వేరుగా ఉంటున్నారు. కౌర్ భర్త తన తండ్రితో కలిసి ఫ్రెస్నో సిటీలో ఉంటుండగా.. కౌర్ సాన్ జోస్లో ఉంటూ వాల్ మార్ట్ స్టోర్లో ఉద్యోగం చేస్తున్నది. ఈ క్రమంలో కౌర్పై కక్ష పెంచుకున్న దొసాంజ్.. వాల్మార్ట్ స్టోర్కు వెళ్లి ఆమెను హత్యచేశాడు.