న్యూఢిల్లీ: భారతీయ విద్యార్థులను ఉక్రెయిన్ బంధించినట్లు రష్యా చేసిన ఆరోపణలను భారత ప్రభుత్వం ఖండించింది. ఇండియన్ స్టూడెంట్స్ను ఓ హ్యూమన్ షీల్డ్ తరహాలో ఉక్రెయిన్ సైనిక బలగాలు వాడుతున్నట్లు రష్యా ఆరోపించింది. తమ భూభాగంలోకి విద్యార్థులు వెళ్లకుండా ఉక్రెయిన్ అడ్డుకుంటున్నట్లు కూడా రష్యా పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ఇవాళ విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ఉక్రెయిన్లో భారతీయ విద్యార్థులను బంధించినట్లు తమకు ఎటువంటి రిపోర్ట్ రాలేదని ఆయన స్పష్టం చేశారు.
ఖార్కివ్తో పాటు సమీప ప్రాంతాల్లో ఉన్న భారతీయులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు నడపాలని ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని కోరినట్లు భారత్ వెల్లడించింది. రష్యా దళాలు ఖార్కివ్ పట్టణాన్ని చట్టుముట్టుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న వేలాది మంది భారతీయ విద్యార్థుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఇంకా ఆ నగరంలో వేల మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఉక్రెయిన్లో ఉన్న భారతీయులతో అక్కడి ఎంబసీ టచ్లో ఉందని, స్థానిక అధికారుల సహకారంతో చాలా మంది భారతీయులు నిన్న ఖార్కివ్ నుంచి బయటకు వచ్చారని, అయితే విద్యార్థుల్ని బంధించినట్లు వాళ్లేమీ చెప్పలేదని అరిందమ్ తన ప్రకటనలో తెలిపారు. రష్యా, రొమేనియా, పోలాండ్, హంగేరి, స్లోవేకియా, మాల్డోవా దేశాలతోనూ సమర్ధవంతంగా సహకారం తీసుకుంటున్నామని, ఉక్రెయిన్ నుంచి గత కొన్ని రోజుల నుంచి భారీ సంఖ్యలో భారతీయులను తరలించామని అరిందమ్ తెలిపారు.ఉక్రెయిన్ అధికారులు అందించిన సహకారాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Our response to media queries regarding reports of Indian students being held hostage in Ukraine ⬇️https://t.co/RaOFcV849D pic.twitter.com/fOlz5XsQsc
— Arindam Bagchi (@MEAIndia) March 3, 2022