United Nations | ఉక్రెయిన్పై రష్యా యుద్ధం విషయంలో భారత్ తన తటస్థ వైఖరిని కొనసాగిస్తున్నది. ఐక్యరాజ్యసమితి (United Nations) వేదికగా రష్యాకు వ్యతిరేకంగా జరిగిన పలు ఓటింగ్లకు ఇండియా దూరంగా ఉన్నది. తాజాగా ఉక్రెయిన్పై రష్యా దండయాత్రకు నేటితో ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ఆ దేశంలో వెంటనే యుద్ధాన్ని ముగించాలని, ఐరాస నిబంధనలకు అనుగుణంగా శాశ్వత శాంతిని నెలకొల్పాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో (UNGA) ప్రవేశపెట్టిన తీర్మానంపై జరిగిన ఓటింగ్లో భారత్ పాల్గొనలేదు.
ఐరాస సాధారణ సభలో మొత్తం 193 దేశాలు సభ్యత్వం కలిగి ఉండగా.. 141 దేశాలు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటువేశాయి. ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో రష్యాకు ఏడు దేశాలు మద్దతు పలికాయి. మరో 32 దేశాలు ఓటింగుకు దూరంగా ఉన్నాయి. వాటిలో భారత్తోపాటు చైనా కూడా ఉన్నాయి. ఇప్పటికే రష్యాకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన తీర్మానాలపై ఓటింగ్కు భారత్ దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.
సైనికచర్య పేరుతో ఉక్రెయిన్పై రష్యా ప్రారంభించిన యుద్ధానికి నేటితో సరిగ్గా ఏడాది పూర్తయింది. అమెరికా సహా పాశ్చాత్య దేశాలు-రష్యా మధ్య ఉన్న ఆధిపత్య పోరు ఉక్రెయిన్ను యుద్ధక్షేత్రంగా మార్చింది. నిత్యం బాంబుల మోతతో ఈ ప్రాంతం దద్దరిల్లుతున్నది. వేలాది మంది సైనికులు యుద్ధంలో ప్రాణాలు విడుస్తున్నారు. ఎందరో అమాయకులు, చిన్నారులు సైతం బాంబు దాడులకు బలయ్యారు. రూ.కోట్లు ఆయుధాల రూపంలో కాలిపోతున్నాయి. భవనాలు శిథిలాలుగా మారుతున్నాయి. వీధులు తుపాకీ చప్పుళ్లతో, సైనిక కవాతుతో మార్మోగుతున్నాయి. బంకర్లు ప్రజలతో నిండిపోతున్నాయి. ఏడాదిగా యుద్ధం మిగిల్చిన నష్టం అంతాఇంతా కాదు. కేవలం ఉక్రెయిన్, రష్యాపై మాత్రమే కాదు ప్రపంచమంతటిపై ఈ యుద్ధ ప్రభావం ఏదో రూపంలో పడింది.