న్యూఢిల్లీ : కరోనా కట్టడికి భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరం చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైన క్రమంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఆసక్తికర అంచనాలు వెల్లడించింది. ఈ ఏడాది చివరి నాటికి భారత్ లో కేవలం 35 శాతం జనాభాకే వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఇదే సమయంలో సంపన్న దేశాలు తమ జనాభాలో వరుసగా 50 శాతం నుంచి 70 శాతం వరకూ వ్యాక్సినేషన్ ను పూర్తిచేస్తాయని ఐఎంఎఫ్ నివేదిక పేర్కొంది.
మరోవైపు కొవిడ్-19 మహమ్మారి అంతానికి ఈ ఏడాది చివరినాటికి ప్రపంచ జనాభాలో కనీసం 40 శాతం జనాభాకు వ్యాక్సిన్ ఇచ్చేలా 3.5 లక్షల కోట్ల నిధులతో ఐఎంఎఫ్ ఎకనమిస్ట్ రుచిర్ అగర్వాల్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ లు ఓ ప్రణాళికను రూపొందించారు. తాము హెచ్చరించినట్టే కొవిడ్-19 అనంతరం రికవరీల్లో అసమానతలు చోటుచేసుకుంటున్నాయని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. వ్యాక్సిన్లు, మందులు పొందడంలోనూ సంపన్న, పేద దేశాల మధ్య అంతరాలు పెరిగాయని పేర్కొంది. ఆఫ్రికా జనాభాలో ఇప్పటివరకూ కేవలం రెండు శాతం లోపు జనాభాకే వ్యాక్సినేషన్ పూర్తికాగా అమెరికాలో 40 శాతం పైగా జనాభాకు, యూరప్ లో 20 శాతానికి పైగా జనాభాకు కనీసం వ్యాక్సిన్ తొలి డోసు పూర్తయిందని తెలిపింది.