జెరూసలెం : ఇజ్రాయెల్- పాలస్తీనా ఉగ్ర సంస్ధ హమాస్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఇజ్రాయెల్, గాజాను కాపాడుకోవడంతో పాటు ప్రపంచ శ్రేయస్సు కోసం హమాస్ను నిర్మూలిస్తామని ఇజ్రాయెల్ రక్షణ బలగాలు (IDF) స్పష్టం చేశాయి. గాజాలో ఐక్యరాజ్యసమితి అధికారుల నుంచి ఇంధనం, మందులను హమాస్ చోరీ చేసిందని ఉగ్ర సంస్ధ నిజస్వరూపం బట్టబయలైందని ఐడీఎఫ్ పేర్కొంది. గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ దాడుల నుంచి తమను తాము కాపాడుకునేందుకు పౌరులను రక్షణ కవచంగా హమాస్ వాడుకుంటోదని ఐడీఎఫ్ ప్రతినిధి ఆడమ్ డానియల్ హగరి పేర్కొన్నారు.
గాజాలో బందీలుగా ఉంచిన ప్రజలను తమ రక్షణ కవచంగా హమాస్ నిస్సిగ్గుగా వాడుకుంటోందని మండిపడ్డారు. హమాస్ ఇజ్రాయెల్పైనా, మానవత్వంపైనా దాడికి తెగబడిందని, వారు యూధులు, అరబ్బులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. కాగా, గాజాలో తమ ఆధీనంలో 250 మంది బందీలు ఉన్నారని ఉగ్ర సంస్ధ సైనిక ప్రతినిధి అబు ఒబీదా వెల్లడించారు. ఇక పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ స్ధావరాలను నేలమట్టం చేయడంతో పాటు ఉగ్రసంస్ధ విధ్వంసం దిశగా తమ దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ రక్షణ దళాల (IDF) ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ పీటర్ లెర్నర్ స్పష్టం చేశారు.
అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ మెరుపు దాడులకు దిగినప్పటి నుంచి ఉగ్ర సంస్ధ లక్ష్యంగా ఐడీఎఫ్ వందలాది దాడులతో విరుచుకుపడిందని పేర్కొన్నారు. ఇజ్రాయెల్తో పాటు తమ పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడేందుకు గాజా స్ట్రిప్ను వేదికగా చేసుకునేందుకు హమాస్ను అనుమతించబోమని అన్నారు. హమాస్ సామర్ధ్యాలను, దాని మౌలిక వసతులను ధ్వంసం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన తర్వాత తాము ఉగ్రసంస్ధ లక్ష్యంగా పదిరోజుల నుంచి దాడులు చేపడుతున్నామని, ఇజ్రాయెల్ పౌరుల భద్రతను పునరుద్ధరించే దిశగా ముందుకు వెళుతున్నామని చెప్పారు. తామిప్పటికే పలువురు ఉగ్రవాదులతో పాటు హమాస్ నేతలను హతమార్చామని వెల్లడించారు.
Read More :
Encounter | బీజాపూర్లో ఎన్కౌంటర్.. మావోయిస్టు మృతి