బీరుట్, నవంబర్ 11: ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య పోరు మరింత తీవ్రరూపం దాల్చింది. లెబనాన్లోని హెజ్బొల్లా గ్రూప్ సోమవారం ఇజ్రాయెల్పై వరుస రాకెట్ దాడులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ నగరం ‘హైఫా’ లక్ష్యంగా 90కిపైగా క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల్లో హైఫాలో పలు భవనాలు దెబ్బతిన్నాయని, పలువురు గాయపడ్డారని, వాహనాలు ధ్వంసమయ్యాయని మీడియా కథనాలు పేర్కొన్నాయి. హెజ్బొల్లా ప్రయోగించిన పలు మిస్సైల్స్ను ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ‘ఐరన్ డోమ్’ అడ్డుకున్నప్పటికీ, మరికొన్ని హైఫాలో పలు జనావాస ప్రాంతాల్ని తాకాయని తెలిసింది. ఒక చిన్నారి సహా నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని ప్రాథమిక సమాచారం. హెజ్బొల్లా రాకెట్ దాడుల్ని ఇజ్రాయెల్ భద్రతా బలగాలు (ఐడీఎఫ్) ధ్రువీకరించాయి. హైఫా పట్టణం శివారు ప్రాంతాల్ని మిస్సైల్స్ తాకాయని ఐడీఎఫ్ పేర్కొన్నది.
హెజ్బొల్లా సభ్యులు ఉపయోగించే సొరంగాలను ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం(ఐడీఎఫ్) ఆదివారం తెలిపింది. వీటిలో ఒకటి శ్మశానం కింద ఉందని ఆరోపించింది. కిలోమీటర్ పొడవున ఉండే ఈ సొరంగాలను గుర్తించామని ఎక్స్లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ సొరంగాల్లో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్స్, నిద్రించే గదులు, ఆయుధగారాలు ఉన్నట్టు ఐడీఎఫ్ వెల్లడించింది. ఓ సొరంగంలో డజన్ల కొద్దీ ఆయుధాలు, ఇతర సైనిక సామగ్రి ఉన్న వీడియోను ఎక్స్లో పోస్ట్ చేసింది. ‘ఉగ్రవాదుల అండర్ గ్రౌండ్ సొరంగాలను మా దళాలు ధ్వంసం చేశాయి. అందులో వ్యూహాత్మకంగా శ్మశానం కింద కూడా ఒకటి ఉంది. హెజ్బొల్లా మనుషులు చనిపోయినా, బతికున్నా వారికి విలువ ఇవ్వదు’ అని ఐడీఎఫ్ విమర్శించింది.
ఇజ్రాయెల్ సైనికులు, పౌరులపై ప్రయోగించేందుకు ఇరాన్ రసాయన ఆయుధాల్ని సిద్ధం చేసిందన్న వార్తలు వెలువడ్డాయి. ఔషధ తయారీలో రసాయన ఏజెంట్స్గా వాడే సింథటిక్ ఓపియాయిడ్లు, ఫెంటానేల్.. వంటి వాటితో ఇరాన్ రసాయన ఆయుధాల్ని అభివృద్ధి చేసిందని అమెరికా రక్షణ రంగ నిపుణుడు మాథ్యూ లెవిట్ వెల్లడించారు. శక్తివంతమైన రసాయన ఏజెంట్స్తో గ్రనెడ్లు, బాంబులను ఇరాన్ తయారుచేసిందని, వీటి ప్రభావానికి లోనైతే.. బాధితుల నాడీ వ్యవస్థ కొన్ని క్షణాల్లో దెబ్బతింటుందని తెలిపారు. ఇజ్రాయెల్ సైన్యం, పౌరులు లక్ష్యంగా ఈ రసాయన ఆయుధాల్ని ప్రయోగించేందుకు ఇరాన్ తయారుచేసిందని చెప్పారు. దీనిపై ఆయన రాసిన ఆర్టికల్ చర్చనీయాంశమైంది. ఇరాన్ రసాయన ఆయుధాల తయారీని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని హెచ్చరించారు. రసాయన ఆయుధాల నుంచి వెలువడే పొగను ఒకసారి పీల్చిగానే, బాధితులు వెంటనే స్పృహ కోల్పోతారని, ఇజ్రాయెల్ సైనికులు, పౌరులను బందీలుగా చేసుకోవడానికి ఇరాన్ వాడొచ్చునని చెప్పారు.