high blood pressure| న్యూఢిల్లీ: దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు హై బీపీతో బాధపడుతున్నట్టు వివిధ సర్వేల్లో తేలింది. ఇందులో కేవలం 12 శాతం మంది మాత్రమే తమ బీపీని నియంత్రణలో ఉంచుకుంటున్నట్టు వెల్లడైంది. హైబీపీ ఉన్నవారు రోజూ ట్యాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తుంటుంది. దీనికి చెక్ పెట్టేలా అమెరికాకు చెందిన అల్నిలామ్ కంపెనీ అద్భుత ఔషధాన్ని అభివృద్ధి చేసింది. ఇంజెక్షన్ రూపంలో అందించే ఈ ఔషధాన్ని ఆరు నెలలకు ఒక సారి తీసుకుంటే సరిపోతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ చికిత్సలో ఇది విప్లవాత్మక మార్పు తీసుకురానున్నదని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.
ఈ ఔషధానికి జిలెబ్సిరాన్ అని పేరు పెట్టారు. ఇది ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నది. యూకేలో 107 మందిపై అధ్యయనం నిర్వహించారు. ఈ ఔషధం తీసుకున్నవారిలో బీపీ ఆర్నెల్ల పాటు నియంత్రణలో ఉన్నట్టు తేలింది. న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. ముందస్తు మరణాలకు, గుండె, కిడ్నీ వ్యాధులకు హైబీపీ కారణమవుతున్నదని, ప్రపంచవ్యాప్తంగా ఏటా ఎంతో మంది దీనికి బలవుతున్నారని పరిశోధకుడు డాక్టర్ అక్షయ్ దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. హైబీపీ చికిత్సలో తమ ఔషధం ప్రభావవంతంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.