BBC | ఢిల్లీ, ముంబై నగరాల్లో ఉన్న బీబీసీ ఆఫీసుల్లో ఇవాళ కూడా ఐటీశాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రంతా సోదాలు చేసిన అధికారులు.. వరుసగా రెండో రోజూ కూడా తనిఖీలు చేపడుతున్నారు. ప్రధాని మోదీపై డాక్యుమెంటరీని బీబీసీ ప్రసారం చేసిన నేపథ్యంలో ఆ సంస్థపై దాడులు చేస్తున్నట్లు ప్రతిపక్షాలు ఇప్పటికే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈ వివాదంపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది.
ఢిల్లీలోని బీబీసీ కార్యాలయాలపై ఆదాయపన్ను అధికారులు చేపట్టిన సర్వే విషయం వాషింగ్టన్ డీసీకి తెలిసిందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ప్రైస్ తెలిపారు. అయితే ఈ విషయంలో తాము ఎలాంటి నిర్ణయం తీసుకునే స్థితిలో లేమని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛకు తమ మద్ధతు ఉంటుందని స్పష్టం చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛ, మానవ హక్కుల వల్లే అమెరికా, భారత్ వంటి దేశాల్లో ప్రజాస్వామ్యం బలోపేతమైందన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
2002 గుజరాత్ అల్లర్ల ఘటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత్ర ఏమిటన్నదానిపై విశ్లేషిస్తూ గత నెల బీబీసీ రెండు భాగాల డాక్యుమెంటరీని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసినప్పటికీ, అనేక విశ్వవిద్యాయాల్లో ప్రదర్శించారు. ఢిల్లీలోని జేఎన్యూ, రాజస్థాన్లోని పలు విశ్వవిద్యాలయాల్లో ఈ ప్రదర్శనలను అడ్డుకోవడం పెద్ద దుమారాన్నే రేపింది. దేశంలో బీబీసీని బ్యాన్ చేయాలని ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు దాన్ని కొట్టేసింది. కాగా, బీబీసీ డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది.