బ్రిస్బేన్: సింగిల్ యూజ్ పేపర్ కప్పుల్లో కాఫీ, టీలాంటి వేడి ద్రవాలు పోసినప్పుడు లక్షలాది మైక్రోప్లాస్టిక్ కణాలు విడుదలవుతాయని ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్ అధ్యయనం వెల్లడించింది. విశ్వవిద్యాలయానికి చెందిన ‘క్వీన్స్లాండ్ అలయన్స్ ఫర్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ సైన్సెస్’ బృందం శిలాజ ఆధారిత పాలిథిన్(పీఈ) పూత పూసిన కప్పులు, అలాగే పాలీలాక్టిక్ యాసిడ్(పీఎల్ఏ) పూత పూసిన కప్పులపై అధ్యయనం చేసింది.
ఈ రెండు రకాల కప్పులు ప్లాస్టిక్ కణాలను విడుదల చేస్తున్నట్లు తేలిందని, అయితే పీఎల్ఏ లేదా బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ పూత కలిగిన కప్పులు 12 రెట్లు ఎక్కువ కణాలను విడుదల చేశాయని డాక్టర్ ఎల్విస్ ఒకోఫో తెలిపారు. కప్పు కాగితంతో తయారైనంత మాత్రాన అది ప్లాస్టిక్ రహితమని అర్థం కాదు. ఎందుకంటే నీటి నిరోధకతను, నిర్మాణ స్థిరత్వాన్ని అందిండానికి చాలా కప్పుల్లో సన్నని ప్లాస్టిక్ పూత ఉంటుందని అన్నారు. దీని అర్థం పేపర్ కప్పుల వాడకాన్ని ఆపేయాలని కాదని, వాటి లోపలి పూతకు ఉపయోగించే పదార్థాల గురించి వినియోగదారులకు సమాచారం అందించాలనేదే తమ ఉద్దేశమని డాక్టర్ ఒకోఫో అన్నారు. ఈ అధ్యయనం ‘ఏసీఎస్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ జర్నల్లో ప్రచురితమయ్యింది.