మెల్బోర్న్ : ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఖలిస్తాన్ మద్దతుదారులు పేట్రేగారు. మెల్బోర్న్ శివార్లలోని బీఏపీఎస్ స్వామినారాయణ్ ఆలయంపై దాడిచేసిన ఖలిస్తాన్ మద్దతుదారులు ఆలయ గోడలపై మిందుస్తాన్ ముర్దాబాద్ అని పెయింట్తో రాయడం కలకలం రేపింది. ఖలిస్తాన్ మద్దతుదారుల విద్వేష దాడితో తాము దిగ్భ్రాంతికి గురయ్యామని, శాంతి, సంయమనం కోసం తాము ప్రార్ధన చేస్తున్నామని స్వామినారాయణ ఆలయ వర్గాలు పేర్కొన్నాయని ఆస్ట్రేలియా టుడే వెల్లడించింది.
ఆలయంపై దాడికి తెగబడిన ఖలిస్తానీ గ్రూప్ భారత టెర్రరిస్ట్, ఖలిస్తాన్ వేర్పాటువాద నేత జర్నైల్ సింగ్ బింద్రావాలాపై ప్రశంసలు గుప్పించిందని తెలిపింది. ఆపరేషన్ బ్లూస్టార్లో సైన్యం అతడిని మట్టుబెట్టింది. ఈ దాడి ఆస్ట్రేలియాలో ప్రశాంతంగా జీవిస్తున్న హిందూ సమాజంలో కలకలం రేపిందని లిబరల్ ఎంపీ ఇవాన్ ముల్హోలండ్ దాడిని ఖండిస్తూ పేర్కొన్నారు.
కాగా, ఉదయాన్నే తాను ఆలయానికి వెళ్లగా ఆలయ గోడలపై ఖలిస్తాన్ అనుకూల, భారత వ్యతిరేక నినాదాలతో పెయింటింగ్స్ కనిపించాయని ఓ స్ధానిక వ్యక్తి తెలిపారు. విద్రోహులపై విక్టోరియా పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని తాము డిమాండ్ చేస్తున్నామని స్ధానికులు పేర్కొన్నారు. ఆలయంపై దాడిని విశ్వహిందూ పరిషత్ ఆస్ట్రేలియా శాఖ తీవ్రంగా ఖండించింది. ఇక గత ఏడాది కెనడాలోనూ స్వామినారాయణ్ మందిర్పై ఖలిస్తానీ మద్దతుదారులు దాడులు చేపట్టి మందిరంపై భారత్ వ్యతిరేక నినాదాలను పెయింట్ చేశారు.