Bangladesh : బంగ్లాదేశ్ లో మరో హిందువు మరణించాడు. స్థానికులు దాడికి ప్రయత్నిస్తుండగా పారిపోతూ ఒక కాలువలో దూకి, ప్రాణాలు కోల్పోయాడు. నౌగావో జిల్లాలోని, మొహదేవపూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతుడిని 25 ఏళ్ల మిథున్ సర్కార్ గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిథున్ సర్కార్ ను చోరీ చేశాడనే నెపంతో స్థానికులు గుంపుగా వెంటాడి పట్టుకునేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో మిథున్ పారిపోతూ పక్కనే ఉన్న కాలువలో దూకి రక్షించుకోవాలనుకున్నాడు. కానీ, కాలువలో దూకి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడి మృతదేహాన్ని ఫైర్ సిబ్బంది సహాయంతో బయటకు తీసి, పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. ఇటీవలి కాలంలో బంగ్లాలో హిందువులు సహా మైనారిటీలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. 2024 నుంచి ఈ దాడులు జరుగుతుండగా.. గత నెల నుంచి తీవ్రస్థాయికి చేరాయి. అందులోనూ గత నెలలో అక్కడి విద్యార్థి నేత షరీఫ్ ఒస్మాన్ హదీ హత్య తర్వాత హిందువులపై దాడులు పెరిగిపోయాయి.
దీపు చంద్రదాస్, ఖోకోన్ చంద్ర దాస్, మణి చక్రవర్తి వంటి పలువురు హిందువులపై అక్కడి మూకలు దాడిచేసి హత్య చేసిన సంగతి తెలిసిందే. 2022 లెక్కల ప్రకారం బంగ్లాదేశ్ లో 13.1 మిలియన్ల హిందువులున్నారు. అంటే అక్కడి జనాభాలో 7.9 శాతం.