కీవ్ : చర్చల ప్రతిపాదనపై ఇరు పక్షాలు సానుకూలంగా ఉన్నా మరోవైపు ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ రాజధానిలోని రెసిడెన్షియల్ హైరైజ్ అపార్ట్మెంట్పై రష్యా మిసైల్ దూసుకొచ్చిందని ఎమర్జెన్సీ సేవల విభాగం శనివారం వెల్లడించింది. రష్యన్ సేనల దాడిని ఉక్రెయిన్ బలగాలు నిలువరిస్తుండగా శుక్రవారం అర్ధరాత్రి కీవ్లోని అపార్ట్మెంట్ బ్లాక్పై క్షిపణి దాడి జరిగిందని అత్యవసర సేవల విభాగం వెల్లడించింది.
క్షిపణి దాడిలో మృతులు, క్షతగాత్రుల వివరాలను ఇంకా అధికారులు నిర్ధారించలేదు. భవనాన్ని ఖాళీ చేయించే ప్రక్రియ సాగుతోందని తెలిపారు. హైరైజ్ బిల్డింగ్పై క్షిపణి దాడిని కీవ్ మేయర్ విటలీ క్లిట్స్కో ధ్రువీకరించారు. కాగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ చర్చల ప్రతిపాదినలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ సానుకూలంగా స్పందించారు. రష్యాతో శాంతి చర్చలు నిర్వహించేందుకు జెలెన్స్కీ అంగీకారం తెలిపారని ప్రెస్ సెక్రటరీ సెర్గే నికిఫరోవ్ తెలిపారు.
కాల్పుల విరమణకు కూడా జెలెన్స్కీ సుముఖత వ్యక్తం చేశారని సెర్గే చెప్పారు. తాము చర్చలను తిరస్కరించినట్లు వస్తున్న ఆరోపణలు అవాస్తవమని..శాంతి, కాల్పుల విరమరణ ఒప్పందానికి ఉక్రెయిన్ కట్టుబడి ఉందని, ఇదే మా శాశ్వత సిద్ధాంతమని, రష్యా అధ్యక్షుడు చేసిన ప్రతిపాదనలను తాము అంగీకరిస్తున్నామని తన ఫేస్బుక్ పేజీలో సెర్గే తెలిపారు.