న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలో ఒక చిన్న ఆత్మాహుతి డ్రోన్ చేసిన పని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్థాన్ను పశ్చిమాసియాలో యుద్ధంలోకి పురిగొల్పుతుంది. ఒకరిపై దాడి జరిగితే తమ ఇద్దరిపై దాడి జరిగినట్లేనని ఒప్పుకొంటూ 2025 సెప్టెంబర్లో సౌదీ అరేబియాతో కుదుర్చుకున్న ఒప్పందానికి పాకిస్థాన్ కట్టుబడుతుందా అన్నదే ఇప్పుడు ప్రశ్న. అస్తిత్వానికి సంబంధించిన ఈ ప్రశ్నకు పాక్ ఇచ్చే సమాధానం దాని భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఎందుకంటే సౌదీతో కుదుర్చుకున్న వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం (ఎస్ఎండీఏ) ఉమ్మడి, సమన్వయంతో కూడిన ప్రతిదాడికి వీలు కల్పిస్తుంది.
ఇందులో అణ్వాయుధాలు ఉంటాయా లేదా అనే దానిపై స్పష్టమైన వివరణ లేదు. సౌదీ అరేబియాపై దాడికి వ్యతిరేకంగా ఇరాన్ విదేశాంగ మంత్రికి పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ పంపిన సందేశాన్ని బట్టి పాక్ మదిలో ఏముందో చూచాయగా అర్థం చేసుకోవచ్చు. తమకు రక్షణ ఒప్పందం ఉందని వారికి(ఇరాన్కు) అర్థమయ్యేలా చెప్పానని దార్ మంగళవారం మీడియాకు చెప్పారు. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి దాడుల వేళ పాక్ తన ఉద్దేశాన్ని బహిరంగంగా అంగీకరించింది.
ఎస్ఎండీఏలో అత్యంత వివాదాస్పదమైన భాగం ఏమిటంటే ఈ ఒప్పందం కింద సౌదీ అరేబియాను రక్షించడానికి పాక్ తన అణ్వాయుధ ఛత్రాన్ని విస్తరించడానికి అనుమతి ఇచ్చిందన్న అనుమానం నెలకొని ఉంది. అయితే పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంలో పాకిస్థాన్ చేరే అవకాశం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎస్ఎండీఏ కారణంగా సౌదీతో పాక్కు దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని కూడా వారు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికైతే పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇరాన్కు హెచ్చరిక మాత్రమే ఇచ్చారని, సౌదీ అరేబియా కోసం పోరాడతామని మాత్రం నిర్ధారించలేదని వారు తెలిపారు. అంతేగాక ఒప్పందం కింద సౌదీకి అణు రక్షణ కల్పిస్తామని పాక్ అధికారికంగా ప్రకటించలేదని కూడా వారు గుర్తు చేశారు.