రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ స్పందించారు. ప్రపంచ నేతలందరూ ఓ సారి అంతరాత్మ మాటను వినాలని అభ్యర్థించారు. ఉక్రెయిన్ విషయంలో రష్యా ప్రవర్తిస్తున్న తీరును చూస్తుంటే.. మనస్సు చాలా బాధపడుతోందన్నారు. సందర్శకులను ఉద్దేశించి పోప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోని రాజకీయ నేతలందరూ ఓ కార్యంలోకి దిగేముందు.. దేవుడి ముందు నిల్చొని, తమని తాము ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు. ఇతరులకు ఇబ్బందులు కలిగించే ఏ చర్యకైనా అందరూ దూరంగానే వుండాలని పోప్ ఉద్బోధించారు.
రష్యా- ఉక్రెయిన్ మధ్య ఉత్కంఠ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు. చర్చలు జరపడానికి తాము సిద్ధంగానే వున్నామని పుతిన్ ప్రకటించారు. చర్చలకు సిద్ధమే అయితే… తమ దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని, వాటిని విస్మరించి ఏమీ చేయమని తేల్చి చెప్పారు. చర్చల కోసం తమ దేశం సదా సిద్ధమే. అందులో అనుమానమే లేదు. దాని ద్వారానే పరిష్కారం దొరుకుతుందని కూడా నమ్ముతున్నాం అని పుతిన్ ప్రకటించారు.