శ్రీలంక.. కండ్లముందు తగలబడిపోతున్న దేశం. 1948లో స్వాతంత్య్రం పొందిన తర్వాత అతిపెద్ద సంక్షోభాన్ని ప్రస్తుతం ఆ దేశం ఎదుర్కొంటున్నది. ఇప్పుడక్కడ ప్రభుత్వమంటూ లేదు. ఆర్థికస్థితి అల్లకల్లోలంగా ఉంది. ఆర్థిక, రాజకీయ అస్థిరత దేశంలో హింసాత్మక ఘర్షణలకు దారితీసింది. పాలనావైఫల్యాలు లంకను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టగా.. పాలకులు సృష్టించిన మతవిద్వేషం దేశ సామరస్యతకు, సామాజిక కలనేతకు తూట్లు పొడిచింది. నాయకత్వ వైఫల్యాల నుంచి దేశప్రజల దృష్టిని ఇతర అంశాలపైకి మరల్చేందుకు ముందుకు తెచ్చిన మతాధిపత్యవాదం.. శ్రీలంక సమాజాన్ని నిట్టనిలువునా చీల్చింది. మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని రగలించిన చిచ్చు.. చివరకు రావణకాష్టమై దేశాన్నే దహిస్తున్నది.
కొలంబో, మే 11: భారత్లాగే శ్రీలంకలోనూ భిన్న మతాలు, సంస్కృతులు ఉన్నాయి. శ్రీలంక అత్యధికులు సింహళ బౌద్ధులు. నైరుతి, మధ్య ప్రాంతాలలో ఉండే వీరు మొత్తం జనాభాల్లో 74.9 శాతం. వీరు కాకుండా మిగిలిన మైనారిటీలంతా 25 శాతం ఉంటారు. అందులో తమిళులు (హిందువులు) 11.1 శాతంగా ఉన్నారు. ఉత్తర, తూర్పు ప్రాంతాలలో వీరు ప్రధానంగా ఉంటారు. ముస్లింలు 9.7 శాతం ఉంటారు. వీరు కాకుండా మధ్య శ్రీలంకలో భారత సంతతికి చెందిన తమిళుల సంఖ్య 4.1 శాతం. దేశాధ్యక్షుడు గోటబయ రాజపక్స ప్రజాస్వామ్య దేశాన్ని ఓ నియంతలా పాలించడం ప్రారంభించారు. అసంబద్ధ విధానాల ఫలితంగా శ్రీలంక ఆర్థిక వ్యవస్థ క్రమంగా పతనమవడం ప్రారంభించింది. విదేశీ మారక ద్రవ్యం తరిగిపోయింది. రాబడి తగ్గిపోయింది. దిగుమతులు లేవు. ఎగుమతులు నిలిచిపోయాయి. పంటల ఉత్పత్తి పడిపోయింది. ప్రధాన ఆదాయవనరుగా ఉన్న పర్యాటకం కుప్పకూలింది. అయితే దేశం కకావికలం కావడానికి కారణమైన రాజకీయ నాయకత్వ వైఫల్యాలను రాజపక్స సోదరులు అంగీకరించలేకపోయారు. సమస్యల మూలాల్లోకి వెళ్లి పరిష్కరించేందుకు బదులుగా.. వాటినుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నించారు.
సామాజిక కలనేతకు తూట్లు
తమ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు దేశాధ్యక్షుడు గొటబయ.. శ్రీలంక సమాజంలో మతపరమైన చీలిక తెచ్చారు. తమనుతాము జాతీయవాదులుగా చెప్పుకుంటూ.. సామాజిక సామరస్యతను క్రమంగా దెబ్బతీయడం ప్రారంభించారు. దేశ సమస్యలకు యూదులు కారణమని హిట్లర్ చెప్పినట్టు.. శ్రీలంక ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ ముస్లిం లు, హిందువులు (తమిళులు) కారణమంటూ మెజారిటీ ప్రజలైన బౌద్ధులను గొటబయ రెచ్చగొట్టారు.
మైనారిటీలపై వేట
గొటబయ పాలనంతా మైనారిటీలను వేధించడమే ప్రధానంగా సాగింది. మొదట తమిళుల వెంట పడ్డారు. తరువాత ముస్లిములను లక్ష్యంగా చేసుకొని దాడులు మొదలుపెట్టారు. 2019లో ఉగ్రవాద దాడులను ప్రభుత్వమే సృష్టించిందనే అభిప్రాయం ఉంది. ఈస్టర్ సందర్భంగా ఆదివారంనాడు జరిగిన బాంబు పేలుళ్లను సాకుగా చూపి ముస్లింల మీద సింహళీయులను రెచ్చగొట్టారు. దేశంలోని సమస్యలన్నిటికీ ముస్లింలే కారణమన్నట్టుగా ప్రచారం మొదలుపెట్టారు. మైనారిటీలు నడిపే విద్యాసంస్థలపై నిషేధం విధించారు. మెజారిటీ సింహళీయుల ఓట్లు వస్తే చాలనేది గొటబయ ఆలోచన.
ఒకే దేశం.. ఒకే చట్టం
గోటబయ విఫలమైనప్పుడల్లా, అతడుండటం వల్లనే దేశం నిలబడినట్టు అనుయాయులు ప్రచారం మొదలుపెట్టేవారు. దేశ ఆర్థికవ్యవస్థ దివాలా తీస్తుంటే.. ‘ఒకే దేశం-ఒకే చట్టం’ అనే నినాదాన్ని గొటబయ ముందుకు తెచ్చాడు. ఈ నినాదంతో భారీ ఎత్తున ఊరేగింపులు తీయించాడు. ఒకే చట్టం కోసం ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్కు ఒక సింహళ బౌద్ధ సన్యాసిని అధిపతిగా పెట్టడం వివాదాస్పదమైంది. ముస్లింల ఆచారాలన్నీ దెబ్బతీయాలనే లక్ష్యంతో ఈ చట్టం తెస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
మనోభావాలను దెబ్బతీసేలా..
ముస్లింలు మృతదేహాలను ఖననం చేస్తారే తప్ప దహనం చేయరు. కానీ కొవిడ్ వచ్చినప్పుడు అనేకమంది ముస్లింల మృతదేహాలను బలవంతంగా దహనం చేశారు. ఖననం చేస్తే భూగర్భ జలాల ద్వారా కొవిడ్ వ్యాపిస్తుందనే అశాస్త్రీయమైన వాదనను ప్రచారంలో పెట్టి ముస్లింల మనోభావాలను దెబ్బతీశారు. విమర్శలు రావడంతో ఒక ప్రదేశం కేటాయించి అక్కడే ఖననం చేయనిచ్చారు.
కొందరి కోసం ఆర్థిక వ్యవస్థ బలి
ఈస్టర్ బాంబు పేలుళ్ల ఘటన, ఆ తర్వాత కరోనా కారణంగా శ్రీలంకకు పర్యాటకుల రాక పూర్తిగా తగ్గిపోయింది. ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలి కొందరు వ్యాపారుల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం పనిచేయడం ప్రారంభించింది. పిడికెడు మందికోసం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారు. విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతుంటే.. దిగుమతులనూ తగ్గించారు. సేంద్రియ వ్యవసాయ విధానంతో పంటల ఉత్పత్తి తగ్గింది. ఆహార కొరత ఏర్పడింది. రాజపక్సె సోదరులు పులిమీద చేసిన స్వారీ.. చివరకు వారిని రాజకీయంగా బలితీసుకున్నది.
హిజాబ్, హలాల్తో మొదలు పెట్టి..
మహిళలు హిజాబ్ వేసుకోవడం ఓ ప్రధాన సమస్యగా చిత్రీకరించారు. బురఖాను నిషేధిస్తూ ఏకంగా మంత్రివర్గం తీర్మానించింది. వెయ్యికి పైగా మదర్సాలను ప్రభుత్వం నిషేధించింది. ‘హలాల్ వద్దు’ అనే గొడవనూ లేవదీసి, దేశవ్యాప్తంగా ప్రదర్శనలు చేపట్టేలా చేశారు. ముస్లిం మతస్థుడు నిర్వహిస్తున్న ఒక హోటల్లో సింహళ పురుషులను నిర్వీర్యం చేసే రసాయనాన్ని ఆహారంలో కలుపుతున్నారంటూ చేసిన అబద్ధపు ప్రచారం మెజారిటీ మతస్థుల్ని రెచ్చగొట్టింది. ముస్లింల దగ్గర వస్తువులు కొనవద్దనే నినాదం ముందుకు తెచ్చారు. వారికి సంబంధించిన వ్యాపార సంస్థలపై దాడులు సాగించారు. దేశంలో ఏదైనా సమస్య ముందుకురాగానే.. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి అధికారపక్షం మతకలహాలను మరింత రెచ్చగొడుతూ పోయింది. బోడు బాలసేన మొదలైన పేర్లతో కొన్ని సంస్థలు ఏర్పడ్డాయి. ఇవి మైనారిటీలపై మూక దాడులు సాగిస్తుంటే, పోలీసులు ప్రేక్షకుల్లా మిగిలిపోయారు. ఎవరికీ శిక్షలు ఉండవు. మైనారిటీలే లక్ష్యంగా ఉగ్రవాద నిరోధక చట్టాన్ని తీసుకువచ్చింది.
ఈ వారంలోనే కొత్త ప్రధాని
శ్రీలంకకు కొత్త ప్రధానిని, క్యాబినెట్ను ఈ వారంలోనే నియమిస్తానని అధ్యక్షుడు గొటబయ రాజపక్స బుధవారం ప్రకటించారు. కొత్త క్యాబినెట్లో రాజపక్సలు ఎవరూ ఉండరని పేర్కొన్నారు. దేశంలో రాజ్యాంగపరమైన సంస్కరణలు తీసుకువస్తామన్నారు. ‘ప్రధాని నియామకం పూర్తి కాగానే పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతాయి. పార్లమెంటుకు ఎక్కువ అధికారాలు కల్పించే 19వ రాజ్యాంగ సవరణ బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెడతాం’ అని తెలిపారు.