మేం అండగా ఉంటాం
మైక్రోసాఫ్ట్, గూగుల్ సీఈవోలు
సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ వెల్లడి
హ్యూస్టన్/వాషింగ్టన్, ఏప్రిల్ 26: కరోనా సంక్షోభంలో అతలాకుతలమవుతున్న స్వదేశాన్ని చూసి మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమకు చేతనైనంత సాయం చేస్తామన్నారు. ‘భారత్లో ప్రస్తుత కరోనా పరిస్థితిని చూసి గుండె పగిలింది. భారత్కు సాయం చేస్తున్నందుకు అమెరికా ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. భారత్లో సహాయ చర్యలకు మా సంస్థ వనరులను, టెక్నాలజీని ఉపయోగిస్తాం. ఆక్సిజన్ పరికరాలను కొనుగోలు చేసేందుకు సహాయం చేస్తాం’ అని సత్యనాదెళ్ల సోమవారం ట్విట్టర్లో తెలిపారు. భారత్లో కరోనా సంక్షోభాన్ని చూస్తుంటే తన మనసు వికలమవుతున్నదని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. ‘గూగుల్ యాజమాన్యం, గూగులర్స్ (సంస్థ ఉద్యోగులు) కలిసి భారత్కు సాయం చేసేందుకు ‘గివ్ఇండియా’, ‘యునిసెఫ్’కు రూ.135 కోట్లు ఇస్తున్నారు. ఈ నిధులను ఔషధాల కొనుగోలుకు, కరోనా ముప్పు ఎక్కువ ఉన్న వారిని ఆదుకొనేందుకు పనిచేస్తున్న సంస్థలకు, కీలక సమాచారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే సంస్థలకు కేటాయిస్తారు’ అని పిచాయ్ ఒక ట్వీట్ చేశారు. కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన కుటుంబాలకు రోజువారీ ఖర్చుల కోసం ‘గివ్ ఇండియా’ నేరుగా నగదు సహాయం చేస్తుంది. కరోనా వ్యాక్సిన్ల సమాచార వ్యూహంలో కూడా భారత ప్రభుత్వానికి గూగుల్ సహకారం అందిస్తున్నది. యూట్యూబ్ ద్వారా విలువైన సమాచారం ఇచ్చేందుకు కృషి చేస్తున్నది. ప్రజలు ఆరోగ్యంగా సురక్షితంగా ఉండేందుకు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు స్థానిక ప్రభుత్వాలు, సంఘాలతో కలిసి పనిచేస్తామని గూగుల్ ఇండియా హెడ్, వైస్ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా కూడా ట్విట్టర్లో తెలిపారు.