బెర్లిన్: ఆఫ్రికా దేశం నమీబియాలో ఊచకోతకు పాల్పడినట్లు తొలిసారి జర్మనీ అంగీకరించింది. వలస పాలన సమయంలో ఈ దారుణం చోటుచేసుకున్నట్లు చెప్పింది. నమీమియాకు బిలియన్ యూరోల ఆర్థిక మద్దతు ఇవ్వనున్నట్లు తాజాగా జర్మనీ ప్రకటించింది. 1904 నుంచి 1908 మధ్య నమీబియాకు చెందిన స్థానిక హెరీరో, నామా తెగలపై జర్మనీ ఊచకోతకు పాల్పడింది. దీంతో ఆ రెండు దేశాల మధ్య సంబంధాలు చెడిపోయాయి. 20వ శతాబ్ధంలో నమోదు అయిన తొలి ఊచకోత ఘటనగా నమీబియా సంఘటనను చరిత్రకారులు చెబుతారు. వలస పాలకుల ఆధిపత్యంలో ఆ అకృత్యాలు చోటుచేసుకున్నట్లు గతంలోనే జర్మనీ అంగీకరించింది.
1884 నుంచి 1915 వరకు నమీబియాను.. జర్మన్ సౌత్ వెస్ట్ ఆఫ్రికాగా పిలిచేవారు. ఆ సమయంలో జర్మనీ పాలకులు ఆ రాజ్యాన్ని పాలించారు. ఆ తర్వాత 75 ఏళ్లు సౌతాఫ్రికా కింద ఉన్నది. 1990లో నమీబియాకు స్వాతంత్య్రం వచ్చింది. జర్మనీ సామ్రాజ్యవాద దళాలపై 1904లో హెరీరో తెగలు తిరుగుబాటు చేశారు. పశువులు, భూమిని లాక్కోవడంతో ఆ తిరుగుబాటు జరిగింది. నామా తెగలు కూడా ఆ పోరాటంలో పాల్గొన్నారు. 1904 ఆగస్టులో జరిగిన వాటర్బెర్గ్ యుద్ధంలో సుమారు 80 వేల మంది హెరీరోలు పరారీ అయ్యారు. కలహరీ ఎడారి వైపు వెళ్లిన వాళ్లలో కేవలం 15 వేల మంది మాత్రమే ప్రాణాలతో మిగిలారు. 1904 నుంచి 1908 వరకు 60వేల మంది హెరిరోలు, పది వేల మంది నామాలు ఊచకోతలో ప్రాణాలు కోల్పోయారు.