బెర్లిన్: యూరోప్ దేశాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జర్మనీ, బెల్జియం దేశాల్లో వరద ఉదృతికి భారీ నష్టం సంభవించింది. యూరోప్ దేశాల్లో మరణాల సంఖ్య 93కి చేరింది. వెస్ట్ జర్మనీలో దాదాపు 80 మంది చనిపోయారు. వందలాది మంది మిస్సయ్యారు. ఎమర్జెన్సీ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బెల్జియంలో 12 మంది మరణించినట్లు తెలుస్తోంది. 21 వేల మంది నిరాశ్రయులయ్యారు. వలోనియా ప్రాంతంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షాల వల్ల లగ్జంబర్గ్, నెదర్లాండ్స్ దేశాల్లోనూ భీకరమైన వరదలు వస్తున్నాయి. ఆ దేశాల్లోనూ వేల సంఖ్యలో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జర్మనీలో నార్త్ రైన్ వెస్ట్ ఫాలియా, రైన్ల్యాండ్-పాలటినేట్ ప్రాంతాల్లో మిస్సింగ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. వరదల వల్ల ఫోన్ నెట్వర్క్లు దెబ్బతిన్నాయి.