అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) కు పీసీసీ అధ్యక్షురాలు, కడప లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల (YS Sharmila) ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కడప కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్ జగన్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. షర్మిల చంద్రబాబు (Chanda Babu) నాయుడి మాట వింటుందని, ఆయనతో చేతులు కలిపిందని, షర్మిలను కంట్రోలు చేస్తున్నాడని చేసిన ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు.
నేను వైఎస్సార్ బిడ్డనని, నేను చాలా మొండిదానినని జగన్కు తెలుసని అన్నారు. చంద్రబాబుతో మిలాఖతైనట్లు ఏ ఒక్క ఆధారం మీ వద్ద ఉందా అని ప్రశ్నించారు. ఏ ఆధారాలు ఉన్నాయో సజ్జల బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఆనాడు చంద్రబాబు చెబితేనే జగన్ కోసం పాదయాత్ర చేశానా? సమైక్యాంధ్ర కోసం పాదయాత్ర (Padayatra) , వైఎస్సార్ మరణం తరువాత చేసిన ఓదార్పు యాత్ర చంద్రబాబు చేబితేనే చేశానా జగన్ చెప్పాలని కోరారు.
షర్మిల ఎవరో చెబితే చేసే వ్యక్తి కాదని తేల్చి చెప్పారు. జగన్కు చంద్రబాబు పిచ్చి పట్టినట్లుందని తాను అద్దం పంపిస్తున్నానని ఆ అద్దంలో ముఖం చూసుకుంటే మీకు మీరు కనిపిస్తున్నారో, చంద్రబాబు ముఖం కనిపిస్తున్నారో టెస్ట్ చేసుకోవాలని సూచించారు. ప్రతిసారి చంద్రబాబు పేరును ప్రస్తావిస్తూ తనను బదనాం చేస్తున్న జగన్ మానసిక స్థితిపై భయమేస్తుందని ఆమె పేర్కొన్నారు.
రాజశేఖర్రెడ్డి బిడ్డను కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదని వెల్లడించారు. వివేకాహత్యలో అవినాష్ రెడ్డి హస్తం లేకపోతే ఎందుకు సమాధానం చెప్పడం లేదని, అవినాష్ను ఎందుకు కాపాడుతున్నారని, నిందితుడిగా ఉన్న వ్యక్తికి మళ్లీ టికెట్ ఎందుకు ఇచ్చారని నిలదీశారు.