US-Iran : ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయంలో ఒక స్పష్టత రావడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ట్రంప్ తన సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ సంచలనంగా మారింది. బాంబును మోసుకెళ్తున్న ఒక యుద్ధ విమానం ఫొటోను షేర్ చేశారు ట్రంప్. ఆ ఫొటోపై ‘థాంక్యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్’ అని రాసి ఉంది.
యుద్ధ విమానం, ఒక మిస్సైల్ ఫొటో షేర్ చేశాడంటే మళ్లీ ఇరాన్పై దాడికి అమెరికా సిద్ధమవుతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒక పక్క ఇరాన్తో అమెరికా చర్చలు కీలక దశలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ డిమాండ్లను అమెరికా అంగీకరించిందని, అమెరికా డిమాండ్లకు కూడా ఇరాన్ తలొగ్గిందని సమాచారం. దీంతో రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఇలాంటి తరుణంలో ట్రంప్ చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. అంతకుముందు కూడా ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ ద్వారా ఇరాన్తో చర్చల అంశంపై స్పందించారు. ఇరాన్తో చర్చలు, ఒప్పందం విషయంలో తామేమీ తొందరపడటం లేదన్నాడు.
ఈ విషయంలో అధికారులకు తగిన స్వేచ్ఛ ఇచ్చామన్నారు. ఇరాన్తో ఒప్పందం కుదిరే వరకు హార్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ నౌకల దిగ్బంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అంతకుముందు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో మాట్లాడుతూ.. త్వరలోనే ప్రపంచం గుడ్ న్యూస్ వినబోతుంది అని ప్రకటించారు. అయితే, ఈ విషయంలో ముందడుగు పడటం లేదు. చాలా రోజులుగా చర్చలు సాగుతున్నా.. ఎప్పుడు కొలిక్కి వస్తాయో తెలియడం లేదు. ఒకపక్క హార్ముజ్ నుంచి కొన్ని నౌకల్ని అనుమతిస్తున్నా.. ఇంకా వందలాది నౌకలు అక్కడ చిక్కుకుపోనట్లు సమాచారం.