పారిస్: ఫ్రాన్స్కు చెందిన ఇద్దరు జర్నలిస్టుల మొబైల్ ఫోన్లను పెగాసస్ స్పైవేర్ ద్వారా హ్యాక్ చేసినట్లు ఆ దేశ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ గురువారం నిర్ధారించింది. ఇన్వెస్టిగేటివ్ వార్తలు కవర్ చేసే మీడియాపార్ట్కు చెందిన జర్నలిస్టులు లీనాగ్ బ్రెడౌక్స్, ఎడ్వీ ప్లెనెల్ మొబైల్ ఫోన్లు పెగాసస్ నిఘా సాఫ్ట్వేర్ ద్వారా హ్యాక్ అయినట్లు ఆ సంస్థ పేర్కొంది. నేరాలకు వ్యతిరేకంగా పోరాటం, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ (OCLCTIC)కు సంబంధించిన ఇద్దరు జర్నలిస్టుల మొబైల్ ఫోన్లను పారిస్లోని ANSSI ప్రధాన కార్యాలయం నిపుణులు తనిఖీ చేశారు.
మీడియాపార్ట్ అధికారికంగా ఫిర్యాదు చేసిన ఒక రోజు తర్వాత పారిస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రోమీ హీట్జ్ జూలై 20న ప్రారంభించిన ప్రాథమిక దర్యాప్తులో భాగంగా ఫ్రాన్స్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ నిపుణులు జర్నలిస్టుల ఫోన్లను తనిఖీ చేసి అవి హ్యాకింగ్కు గురైనట్లు తేల్చారు. కాగా, పెగాసస్ స్పైవేర్ ద్వారా మొబైల్ ఫోన్ల హ్యాక్ గురించి ఒక ప్రభుత్వ దర్యాప్తు సంస్థ నిర్ధారించడం ఇదే తొలిసారి.
మరోవైపు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్పై నిఘా కోసం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తేలడంతోపాటు మొరాకో ప్రభుత్వ సంస్థల ఆదేశాల మేరకు ఫ్రాన్స్ ప్రభుత్వం కూడా పెగాసస్ స్పైవేర్ అంశంపై దర్యాప్తు ప్రారంభించింది.