సిద్దిపేట అర్బన్, మార్చి 25: సిద్దిపేట పట్టణానికి మరో వెయ్యి డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరైనట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా గతంలో 2460 డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేసుకొని వాటిని పూర్తి చేసి సీఎం కేసీఆర్ చేతులమీదుగా సామూహిక గృహ ప్రవేశాలు చేసుకున్నామని తెలిపారు. సిద్దిపేట పేదలకు నిలువెత్తు నీడగా.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు దక్కాలనే సంకల్పంతో ఇండ్లు నిర్మించుకున్నామన్నారు. గత డిసెంబర్లో సీఎం కేసీఆర్ సిద్దిపేట పర్యటనకు వచ్చిన సందర్భంగా మరో వెయ్యి ఇండ్లు మంజూరు చేయాలని చేసిన విజ్ఞప్తి మేరకు నేడు వెయ్యి ఇండ్లు మంజూరు చేసి ఇచ్చిన హామీ నెరవేర్చారన్నారు. ఇండ్లు మంజూరు చేసినందుకు నిరుపేదల పక్షాన సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ పనులను వెంటనే ప్రారంభించడానికి అవసరమగు భూసేకరణ చేసి స్థలాన్ని గుర్తించాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డిని మంత్రి ఆదేశించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంతిల్లు
సిద్దిపేట పట్టణంలోని కేసీఆర్నగర్లో 2460 నిర్మించి ఇప్పటికే 1650 డబుల్ బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేశారు. అయితే సిద్దిపేట పట్టణంలో మొత్తం 11 వేలకు పైగా దరఖాస్తులు రావడంతో అర్హులందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఉన్న ఇండ్లు సరిపోక సిద్దిపేట పర్యటనలో మరో వెయ్యి ఇండ్లు ఇవ్వాలని మంత్రి హరీశ్రావు సీఎం కేసీఆర్ను విన్నవించారు. ఇచ్చిన మాట ప్రకారం అంగీకరించిన సీఎం కేసీఆర్ నేడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో కేసీఆర్నగర్ కాలనీలో 2460 డబుల్ బెడ్ రూం ఇండ్లకు తోడుగా నేడు వెయ్యి ఇండ్లను కలుపుకొని 3460 ఇండ్లు అందుబాటులోకి రానున్నాయి. సొంత ఇల్లు లేని నిరుపేదలు సిద్దిపేటలో ఉండబోరని పలు సందర్భాల్లో మంత్రి హరీశ్రావు చెప్పిన మాట నిజం కాబోతున్నది.