భువనేశ్వర్ : ‘యాస్’. ఈ పేరు అందరికీ తెలిసిందే. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ఒడిశా, బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది. తూర్పు తీర ప్రాంతాలపై పెను ప్రభావం చూపిన విషయం తెలిసిందే. ఈ తుఫాను సమయంలో ఒడిశాలో 750 మందికిపైగా పిల్లలు జన్మించారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు ‘యాస్’ పేరు పెట్టాలని నిర్ణయించుకుంటున్నారు. మంగళవారం రాత్రి తుఫాను బాలాసోర్కు దక్షిణాన 50 కిలోమీటర్ల దూరంలోని బహనాగా సమీపంలో తీరం దాటిన సమయంలో నవజాత శిశువులు జన్మించారు.
బాలాసోర్ నగరంలోని పరాఖీ ప్రాంతానికి చెందిన సోనాలిమైత్రికి అబ్బాయి పుట్టాడు. తుఫాను రాకను సూచించే ‘యాస్’ కంటే మంచి పేరును తాను ఆలోచించలేదని సోనాలి చెప్పారు. కేంద్రపారాకు చెందిన సరస్వతీ బైరాగి సైతం తనకు పుట్టిన కుమార్తెకు తుఫాను పేరుపెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. తన కుమార్తె పుట్టిన సమయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటారని, తన కుమార్తె జన్మించిన రోజు, ఆమెను ప్రపంచం అంతా జ్ఞాపకం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంటుందని సరస్వతీ చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో తమ పిల్లలకు ‘యాస్’ అని పేరు పెట్టినట్లు సమాచారం అందిందని అధికారులు చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుకు ఒమన్ ‘యాస్’గా పేరును ప్రతిపాదించింది. ఈ పర్షియన్ పదానికి ‘మల్లె’ అని, ఇంగ్లిష్లో జాస్మిన్ అని అర్థం. ఒడిశా ప్రభుత్వ లెక్కల ప్రకారం.. తుఫాను సమయంలో ఒడిశాలో 6500 మంది గర్భిణులను సహాయక శిబిరాలకు తరలించారు.
ఇందులో నెలలు నిండిన గర్భిణులను హాస్పిటల్కు తరలించారు. కేంద్రపారా జిల్లాలో 166 మంది, బాలాసోర్ జిల్లాలో 58మంది, భద్రక్లో 98 మంది, ఖుర్దాలో 95 మంది, కటక్లో 61 మంది, జగత్సింగ్పూర్లో 84, జాజ్పూర్లో 69, కియోంజార్లో 55 మంది, మయూర్భంజ్లో 36, పూరీ జిల్లాలో 10 మంది నవజాత శిశువులు జన్మించారని ఒడిశా మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.