Marco Rubio : ఇటీవలి కాలంలో హెచ్1బీ వీసాలు సహా అనేక అంశాల్లో అమెరికా కొత్త నిబంధనలు రూపొందించిన సంగతి తెలిసిందే. అమెరికాలో ఉంటున్న చాలా మందికి గ్రీన్ కార్డులు రాక ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రశ్నించారు. అయితే, తాము కొత్త నిబంధనల పేరుతో ఇండియాను టార్గెట్ చేయలేదని రుబియో అన్నారు.
అమెరికా, ఇండియా విదేశీ మంత్రుల మధ్య న్యూఢిల్లీలో ఆదివారం చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా అనేక అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ఇటీవల అమెరికా టూరిస్ట్ వీసాలు, హెచ్1బీ వీసాల్లో ఇండియన్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు రుబియో దృష్టికి జైశంకర్ తీసుకెళ్లారు. దీనిపై రుబియో స్పందిస్తూ.. తాము ఇండియాను ప్రత్యేకంగా టార్గెట్ చేయలేదని, తమ నిబంధనలు అన్ని దేశాలకు వర్తిస్తాయన్నారు. ఇండియన్స్పై అమెరికాలో జరుగుతున్న జాతి వివక్ష దాడులపై కూడా ఆయన మాట్లాడారు. ప్రతి దేశంలో కొందరు మూర్ఖులు ఉంటారని, ఇండియాలోనూ, అమెరికాలోనూ ఉన్నారని, అలాంటి కొద్ది మంది చేసే పనులు తమ దేశపు విధానాన్ని ప్రతిబింబించబోవని అన్నారు.
వలసదారులతో అమెరికా స్నేహబంధాన్ని కొనసాగిస్తుందన్నారు. ఇలాంటి ఘటనల్ని తీవ్రం గా పరిగణిస్తామని, వ్యక్తిగతంగా జరిగే ఈ దాడులు తమ దేశ సంస్కృతికి సంబంధించినవి కావు అన్నారు. తమ దేశం అందరినీ స్వాగతిస్తుందని చెప్పారు. అమెరికా ఆర్థికాభివృద్ధిలో భారతీయులు ఎంతో కృషి చేశారని, ఇది భవిష్యత్లో కూడా కొనసాగాలని భావిస్తున్నట్లు రుబియో వెల్లడించారు. అమెరికాలో 2 కోట్ల మంది వరకు అక్రమంగా వలస వచ్చి ఉంటున్నారని, అందువల్లే నిబంధనలు మార్చామాని రుబియో చెప్పుకొచ్చారు. అక్రమ వలసల్ని నియంత్రించేందుకు అమెరికాకు ఇండియా అండగా నిలుస్తుందని జైశంకర్ పేర్కొన్నారు.