వాషింగ్టన్: హోర్ముజ్ జలసంధిని 48 గంటల్లో తెరవకుంటే.. ఇరాన్ విద్యుత్తు ప్లాంట్లను పేల్చివేస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే వార్నింగ్కు చెందిన గడువు ముగియకముందే.. ట్రంప్ నాటకీయంగా యూటర్న్ తీసుకున్నారు. ఆపపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి అయిదు రోజుల విరామం ప్రకటించారు. ఫిబ్రవరి 28వ తేదీన అకస్మాత్తుగా ఇరాన్పై దాడి చేసి కీలక నేతల్ని హతమార్చారు. 4 వారాల పాటు తమ సమరం కొనసాగుతుందన్న ట్రంప్.. దానికి తగినట్లే ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ వార్ నాలుగో వారంలోకి ఎంటర్ కావడంతో వ్యూహాత్మకంగా ట్రంప్ తన ప్రణాళిక మార్చినట్లు స్పష్టమవుతోంది.
ట్రంప్ హెచ్చరికలు.. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రతి హెచ్చరికలతో.. ఇరాన్ సంక్షోభం యావత్ ప్రపంచాన్ని విస్మయంలోకి నెట్టేసింది. చమురు నిల్వలు కలిగిన ఇరాన్ తనపై దాడికి ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లో పెను విధ్వంసం సృష్టించింది. మూడు వారాలు ముగిసినా ఏ ఒక్క గల్ఫ్ దేశం కూడా ఇరాన్పై తిరిగి దాడి చేయలేదు. దీంట్లో ఉన్న యుద్ధ మర్మం అర్థంకాని అంశం. ఇరాన్ దళాలకు అండ ఇచ్చిన లెబనాన్ను మాత్రం ఇజ్రాయెల్ చిత్తు చేసింది.
అయితే ఇరాన్ సంక్షోభం భీకరంగా మారుతుందన్న దశలో.. ట్రంప్ తనదైన శైలిలో వార్కు బ్రేక్ ఇచ్చారు. విద్యుత్తు ప్లాంట్లను పేల్చితే తాము కూడా విద్యుత్తు ప్లాంట్లను పేల్చుతామని ఇరాన్ ప్రతి హెచ్చరిక చేసిన కొన్ని గంటల్లోనే చర్చల వైపు ట్రంప్ మళ్లారు. దౌత్యం, చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని భారత ప్రధాని మోదీ కూడా ఇవాళ పార్లమెంట్లో సూచన చేసిన విషయం తెలిసిందే. ఇరాన్ పవర్ ప్లాంట్లపై సైనిక దాడుల్ని వాయిదా వేయాలని ట్రంప్ కోరడం ప్రపంచ దేశాలకు ఓ శాంతి సందేశమే అవుతుంది. సంక్షోభాన్ని సంపూర్ణంగా పరిష్కరించేందుకు అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయని, గత రెండు రోజుల నుంచి జరిగిన చర్చలు ఆశాజనకంగా ఉన్నట్లు ట్రంప్ చేసిన కీలక ప్రకటన పశ్చిమాసియాతో పాటు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచింది.
చర్చలు చాలా లోతుగా, సవివరంగా, నిర్మాణాత్మకంగా జరుగుతున్నాయని, వారం పాటు చర్చలు జరుగుతాయని ఆయన అన్నారు. దాడులు వాయిదా వేసిన ట్రంప్ మళ్లీ ఎలాంటి టర్న్ తీసుకుంటారో తెలియదు. కానీ తాత్కాలిక విరామం ఇప్పుడు అత్యవసరమే. ఇజ్రాయెల్ మాత్రం ట్రంప్ వ్యాఖ్యలపై ఇంకా స్పందించలేదు. ట్రంప్ వ్యాఖ్యలను నమ్మలేమని ఇరాన్ చెబుతోంది. ఇరాన్కు అండగా నిలిచన రష్యా మాత్రం ప్రకటన చేసింది. శత్రుత్వాన్ని పక్కన పెట్టి, రాజకీయ పరిష్కారాన్ని ఆలోచించాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ తెలిపారు. రష్యా ప్రకటన వెనుక ఇరాన్ ప్రోత్సాహం ఉన్నట్లు తెలుస్తోంది.
అమెరికా-ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడి వల్ల ఇరాన్లో 1444 మంది మరణించారు. సుమారు 18,551 మంది గాయపడినట్లు ఇరాన్ ఆరోగ్యశాఖ పేర్కొన్నది.