New Twitter Poll | ట్విట్టర్ను హస్తగతం చేసుకోగానే దాని భవిష్యత్పై ఎన్నో ప్రణాళికలు రచించారు ఎలాన్ మస్క్. ఇప్పటికే దీనిపై వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఎందరో ఉద్యోగులను తొలగించారు. ఎవరు ఏ కామెంట్స్ చేసినా పట్టించుకోకుండా.. ఇటీవలనే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రాపర్ కాన్యే వెస్ట్ ట్విట్టర్ ఖాతాలను తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం మరో కొత్త పోకడకు దారితీసేలా పోల్ చేపట్టి ప్రపంచం దృష్టిని ఆకర్శిస్తున్నారు.
విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్, వికీలీక్స్ సహ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేలను అమెరికన్ ప్రభుత్వం క్షమించాలా? వద్దా? అనే దానిపై ట్విట్టర్ కొత్త యజమాని ఎలోన్ మస్క్ ఆదివారం ట్విట్టర్ ఖాతాదారులకు పోల్ చేపట్టారు. ‘నేను నా అభిప్రాయం వ్యక్తం చేయడం లేదు. కానీ, ఈ పోల్ నిర్వహిస్తానని గతంలోనే వాగ్దానం చేశాను. అసాంజే, స్నోడెన్లను క్షమించాలా?’ అని మస్క్ ట్విట్టర్లో రాశారు. పోల్ పోస్ట్ చేసిన గంటలోపే 5,60,000 కంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. ఎక్కువ మంది సానుకూలంగా ఓటు వేశారు. వీరిద్దరినీ క్షమించాలంటూ ఇప్పటివరకు 79.8 శాతం మంది యెస్ అని ఓటు వేసినట్లు సమాచారం.
అమెరికా మిలిటరీ, ఇంటెలిజెన్స్ తప్పులు, నిఘాలను బహిర్గతం చేసే రహస్య, సున్నితమైన సమాచారాన్ని లీక్ చేసిన తర్వాత జూలియన్ అసాంజే, స్నోడెన్ ఇద్దరూ ప్రవాస జీవితం గడుపుతున్నారు. స్నోడెన్కు సెప్టెంబర్ నెలలో రష్యా పౌరసత్వం లభించింది. అసాంజే ప్రస్తుతం లండన్ నుంచి తనను అమెరికాకు రప్పించడాన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఉన్నాడు.