కాఠ్మండూ: ఆర్థిక మాంద్యంతో నేపాల్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతున్నాయి. ఈ దేశం కూడా మరో శ్రీలంకలా మారనుందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. కొంతకాలంగా నేపాల్ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్నది. షరతులతో కూడిన భారీ రుణాలు నేపాల్ను అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి. గ్లోబల్ యాంటీ మనీలాండరింగ్ వాచ్ డాగ్ అయిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) నేపాల్ను గ్రే లిస్ట్లో చేర్చితే ప్రతికూల ప్రభావం పడుతుందనే భయం కూడా ఆ దేశానికి పట్టుకొన్నది. ద్రవ్యోల్బణం 8శాతానికి పెరిగిపోయింది. దిగుమతులపై ఆధారపడడంతో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే పరిస్థితిలో కూడా లేదు. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల కారణంగా ఇంధనాలు, రసాయన ఎరువులు తదితర వస్తువులను అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తున్నది. వస్తువులు, భూములు, షేర్ల ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో అంతగా వృద్ధి లేకపోవడం ఆ దేశాన్ని కష్టాల్లోకి నెడుతున్నది.