కాబూల్: అఫ్ఘానిస్థాన్ వరుస భూకంపాలతో దద్ధరిల్లింది. శనివారం మధ్యాహ్నం కేవలం అరగంట వ్యవధిలో మూడు భూకంపాలు చోటుచేసుకున్నాయి. మధ్యాహ్నం 12:11 గంటలకు తొలి భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1 గా నమోదైంది. తుర్క్మెనిస్థాన్లోని అస్గాబట్ నగరానికి ఆగ్నేయంగా 471 కిలో మీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 21 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.
ఆ తర్వాత 8 నిమిషాలకే అంటే 12:19 నిమిషాలకే మరోసారి భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రత 5.9గా నమోదైంది. ఆ తర్వాత 23 నిమిషాల వ్యవధి తర్వాత అంటే 12:42 గంటలకు మరోసారి భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. అస్గాబట్ నగరానికి ఆగ్నేయంగా 428 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 34 కిలోమీటర్ల లోతుతో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అయితే, ఈ భూకంపాలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ భూకంపంవల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. కాగా, గత మంగళవారం నేపాల్లో కూడా వరుసగా నాలుగు భూకంపాలు సంభవించాయి. ఈ భూకంపాల ధాటికి భారతదేశ రాజధాని ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్తోపాటు ఉత్తర భారతం అంతటా ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. యూపీ, ఉత్తరాఖండ్లో కూడా భూమి కంపించింది.
An earthquake with a magnitude of 6.2 on the Richter Scale hit Afghanistan at 12:42 pm today: National Centre for Seismology https://t.co/yLpG6uOver pic.twitter.com/TDbxzxGjOQ
— ANI (@ANI) October 7, 2023