టోక్యో: జపాన్ దేశంలో గురువారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.45 గంటలకు జపాన్లోని కురిల్ దీవుల్లో భూమి ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. సముద్రమట్టానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఈ విషయాన్ని వెల్లడించింది.
ఈ భూకంపం వల్ల ఏమైనా ఆస్తి నష్టం గానీ, ప్రాణ నష్టం గానీ జరిగిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, జపాన్లో గత అక్టోబర్లో కూడా భారీ భూకంపం సంభవించింది. దక్షిణ జపాన్లోని తోరిషిమా ద్వీపం సమీపంలో 6.6 తీవ్రతతో భూమి కంపించింది. టోక్యోకు దక్షిణంగా 550 కిమీ (340 మైళ్లు) దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో భూకంపం కేంద్రీకృతమైందని జపాన్ భూకంప పరిశోధన కేంద్రం తెలిపింది.
అంతకుముందు ఈ ఏడాది జూన్లో కూడా ఉత్తర జపాన్లోని హక్కైడో ద్వీపంలో భారీ భూకంపం తీవ్ర భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై ఆ భూకంపం తీవ్రత 6.2గా నమోదైంది. అయితే, ఆ రెండు భూకంపాల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ఆస్థి నష్టం గానీ జరగలేదు.