వాషింగ్టన్: సుప్రీంకోర్టు తీర్పును ఆసరాగా చేసుకుని ఆటలు ఆడాలనుకునే ఏ దేశమైనా ఇంకా ఎక్కువ సుంకాలను ఎదుర్కోవలసి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం హెచ్చరించారు. జాతీయ అత్యవసర చట్టం ఆధారంగా ట్రంప్ గత సంవత్సరం విధించిన సుంకాలు చట్ట విరుద్ధమని పేర్కొంటూ సుప్రీంకోర్టు గత శుక్రవారం ఇచ్చిన తీర్పు ఇప్పటికే సంతకం చేసిన లేదా పెండింగ్లో ఉన్న వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి ఇతర దేశాలలో అనిశ్చిత స్థితి ఏర్పడే అవకాశం కల్పించింది.
హాస్యాస్పదమైన సుప్రీంకోర్టు తీర్పుతో ఆటలు ఆడాలనుకునే ఏ దేశమైనా ముఖ్యంగా అమెరికాను ఏండ్ల తరబడి, దశాబ్దాల తరబడి కొల్లగొట్టిన దేశాలు ఇటీవల అంగీకరించిన దానికంటే చాలా ఎక్కువ సుంకాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. కొనుగోలుదారులూ జాగ్రత్త అంటూ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ హెచ్చరించారు.