వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి సుంకాల బెదిరింపులకు దిగారు. రష్యాతో చమురు వ్యాపారం ముగించకుంటే భారత్ భారీగా సుంకాలు (Trump Tariffs) చెల్లించాల్సి వస్తుందన్న ట్రంప్.. తాజాగా చైనాను (China) హెచ్చరించారు. నవంబర్ 1వ తేదీ లోగా అమెరికాతో న్యాయమైన వాణిజ్య ఒప్పందం (Trade Deal) కుర్చుకోకపోతే బీజింగ్పై సుంకాలు 155 శాతానికి పెంచుతానంటూ వార్నింగ్ ఇచ్చారు. చైనాకు అమెరికాపై అపార గౌరవ ఉందని, అందుకే ఎక్కువ టారిఫ్లు చెల్లిస్తున్నదంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. అమెరికా.. ఆస్ట్రేలియాతో 8.5 బిలియన్ డాలర్ల అరుదైన ఖరిజాల ఒప్పందం కుదుర్చుకున్నది. సోమవారం ఆ దేశ ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో వైట్హౌస్లో భేటీ అయిన ట్రంప్.. ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చైనా ఇప్పటికే 55 శాతం సుంకాలు చెల్లిస్తున్నది. జిన్పింగ్తో న్యాయమైన వాణిజ్య ఒప్పంద కుదరకపోతే ఆ సుంకాలు నవంబర్ 1 నుంచి 155 శాతానికి పెరుగుతాయని హెచ్చరించారు. అయితే చైనా పరస్పర రాయితీలు ఇస్తే సుంకాలను తగ్గించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
చాలా దేశాలు అమెరికాను సద్వినియోగం చేసుకుంటున్నాయన్నారు. చైనా మాత్రం అమెరికాను సద్వినియోగం చేసుకోలేకపోతోందన్నారు. ఆ దేశంలోతో అద్భుతమైన వాణిజ్య ఒప్పందం కుదరనుందని భావిస్తున్నా. తద్వారా ఇరు దేశాలకు మాత్రమే కాకుండా ప్రపంచానికి కూడా మంచి జరుగుతుందని వెల్లడించారు. అమెరికాను ఎన్నో దేశాలు గతంలో దోపిడీ చేశాయని, ఇకపై అలాంటి పరిస్థితి ఉండదన్నారు. అమెరికాను చైనా అరుదైన ఖనిజాలతో బెదిరించిందని, దాన్ని తాను సుంకాలతో తిప్పికొట్టానని చెప్పారు. చైనాతో తాను సత్సంబంధాలను కోరుకుంటున్నానని ట్రంప్ అన్నారు. వచ్చే ఏడాది జనవరిలో చైనాలో పర్యటించాలన్న ఆహ్వానాన్ని అంగీకరించానని చెప్పారు. జిన్పింగ్తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. మరో రెండు వారాల్లో దక్షిణ కొరియాలో ఆయనతో సమావేశం కానున్నట్లు చెప్పారు.
కాగా, ఈ నెల 31 నుంచి దక్షిణ కొరియా వేదికగా ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకారం (APEC) సమావేశం జరుగనుంది. దీనికి ముందే అక్టోర్ 29, 30 తేదీల్లో ట్రంప్ అక్కడ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ట్రంప్ భేటీ కానున్నారు.