శరవేగంగా ఫుడ్ప్రాసెసింగ్ జోన్
ఉమ్మడి జిల్లాలో స్థల సేకరణ
త్వరలోనే ప్రభుత్వానికి డీపీఆర్
ఇప్పటికే సిరిసిల్లలో శంకుస్థాపన
నెల రోజుల్లో పనులు ప్రారంభం
సీఎం కేసీఆర్ ప్రత్యేక పర్యవేక్షణ
కరీంనగర్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతో ఉమ్మడి జిల్లాలో ఆహార ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతున్నాయి. వరి, పత్తి,
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే నాలుగు జిల్లాల్లో 1015 ఎకరాలు కేటాయించగా, ఆయా జిల్లాల కలెక్టర్ల ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. త్వరలో డీపీఆర్లు కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫాస్ట్రక్చర్స్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయగా, త్వరలోనే పనులు మొదలుపెట్టనున్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాట్లలో వేగం పెంచారు. ఇవి పూర్తయితే మన పంటలు ఇక్కడే ప్రాసెసింగ్ అవడమే కాకుండా ఇటు రైతులకు మంచి ధర, అటు యువతీయువకులకు ఉపాధి మార్గాలు పెరిగే అవకాశమున్నది.
మొక్కజొన్న వంటి ప్రధాన పంటలే కాకుండా పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటల ఉత్పత్తులు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నది. ఈ నేపథ్యంలో పెరగనున్న పంట ఉత్పత్తులను సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు సమీకృత పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకా రం చుడుతున్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రధానంగా వరి పంట అత్యధికంగా సాగు చేస్తు న్న నేపథ్యంలో ఇక్కడ వరి, దాని అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అధికారులు డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్)ను సిద్ధం చేస్తున్నారు. దీనికి ప్రాధాన్యత ఇస్తూనే ఈ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే ఇతర పంటలపైనా దృష్టి సారిస్తున్నారు. పత్తి విత్తన, దాణా, దాల్ మిల్లులు, మొక్క జొన్న ఆధారిత ప్రాసెస్ యూనిట్లు, కూరగాయల ఉత్పత్తి, పరిరక్షణ యూనిట్లు నెలకొల్పేందుకు డీపీఆర్ సిద్ధం చేస్తున్నారు. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుకు కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్కు(టీఎస్ఐఐసీ) స్థలాలను కేటాయించారు.
స్థానికులకు ఉపాధి అవకాశాలు..
ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటైతే స్థానిక యువత కు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఒక్కో దగ్గర వంద పరిశ్రమలకుపైగానే నెలకొల్పే అవకాశాలు ఉన్నందున సు మారు 4 వేల మందికి ప్రత్యక్షంగా, మరో నాలుగైదు వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. అంతర్జాతీయ కంపెనీలు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నందున స్థానిక పరిసరాలు కూడా పూర్తిగా మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ నెలకొల్పబోయే పరిశ్రమల్లో 80 శాతం మంది స్థానికులకే ఉపాధి అవకాశాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు ఉమ్మడి జిల్లా నుంచే వెళ్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఇక్కడ పెద్ద ఎత్తున ఆహార ఉత్పత్తులు జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే ప్రధాన పంటగా వరిని గణనీయంగా సాగు చేస్తున్న రైతులకు రైస్ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పితే తాము పండించిన పంట ఉత్పత్తులకు మంచి ధర లభించే అవకాశాలు ఉంటాయి. అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు కూడా ప్రభుత్వానికి ఇదే నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో రైస్ ఆధారిత పరిశ్రమలే ఎక్కువగా నెలకొల్పే అవకాశాలు ఉండబోతున్నాయి. అయితే దాల్, ఆయిల్, సీడ్ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పేందుకు కూడా అధికారులు డీపీఆర్ సిద్ధం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేటాయించిన భూమిలో ముందుగా రోడ్లు, మురుగు కాలువలు, విద్యుత్, నీటి వసతి కల్పిస్తారు. ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పాలకునే కుతూహలం పారిశ్రామికవేత్తలు తమ ప్రాజెక్టు పూర్తి వివరాలు తెలుపుతూ అందుకు అవసరమైన స్థలం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తులను పరిశీలించి స్థలాలు కేటాయించేందుకు రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ ఉంటుంది. ఈ కమిటీ నిర్ణయించిన ధర చెల్లించి పరిశ్రమల ఏర్పాటుకు స్థలాలు పొందవచ్చు. జిల్లాలోని పారిశ్రామిక వేత్తలే కాకుండా రాష్ట్రం, దేశ, విదేశాల నుంచి వచ్చి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు ఉత్సాహం చూపితే ఒప్పందం ప్రకారం స్థలాలు కేటాయిస్తారు. స్థలాలు కేటాయించిన రెండేళ్లలో సంబంధిత పారిశ్రామిక వేత్తలు తాము నెలకొల్పాలనుకున్న యూనిట్ను అభివృద్ధి చేసుకోవాలి. లేని పక్షంలో తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది.
ఏయే జిల్లాల్లో ఎక్కడెక్కడ?
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఒగులాపూర్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం 448 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. మూడు రోజు కిందనే మొదలైన ఈ ప్రక్రియలో భాగంగా భూమి సర్వే నిర్వహించి సరిహద్దులు ఏర్పాటు చేసే పనిలో రెవెన్యూ అధికారులు ఉన్నారు. టీఎస్ఐఐసీ అధికారులు తమకు కేటాయించిన స్థలానికి హద్దులు నిర్ణయించి, చదును చేసే పనులపై దృష్టి పెట్టారు. ఇక్కడ అనువైన ప్రభుత్వ భూమి ఉండడంతో పెద్ద ఎత్తున ఆహార శుద్ధి పరిశ్రమలు నెలకొల్పేందుకు ఒగులాపూర్ అనువైన ప్రాంతంగా కలెక్టర్ శశాంక సహా అధికారులు అభిప్రాయపడుతున్నారు. జిల్లా కేంద్రం కరీంనగర్కు 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఒగులాపూర్ హైదరాబాద్కు వెళ్లే రాజీవ్ రహదారి నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి నుంచి ఒగులాపూర్ వరకు వంద అడుగుల డబుల్ రోడ్డు నిర్మించే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా ఒగులాపూర్లో అభివృద్ధి చేస్తున్న స్థలంలోనూ అన్ని రకాల మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలలో 269 ఎకరాల స్థలాన్ని ఫుడ్ప్రాసెసింగ్ యూనిట్ల కోసం కేటాయించింది. ఎగువ మానేరు ప్రాజెక్టుతో నీటి వనరులు పుష్కలంగా ఉన్నందున ఇక్కడ నెలకొల్పాలని నిర్ణయించగా, ఇప్పటికే 15 ఎకరాలలో ‘అగస్త్య సూపర్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్’ ఉత్పత్తులు ప్రారంభించేందుకు మంత్రి కేటీఆర్ గత ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. మంత్రి కేటీఆర్ చొరవతో పరిశ్రమ స్థాపనకు ఈ కంపెనీ ముందుకొచ్చింది. ఈ యూనిట్లో వందలాది మందికి ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో సంస్థ ఏర్పాట్లు చేస్తున్నది. ప్రస్తుతం నిర్మాణ పనులు ప్రారంభించగా, మరిన్ని యూనిట్లు నెలకొల్పేందుకు చాలా సంస్థలు ముందుకొస్తున్నాయి. మరోవైపు ఇక్కడ రోడ్లు, మౌలిక వసతుల కోసం టీఎస్ఐఐసీ డీపీఆర్ సిద్ధం చేస్తున్నది.
నెల రోజుల్లో పనులు మొదలు
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. అన్ని జిల్లాల్లో నెల రోజుల్లో ప్లాటింగ్ కోసం మౌలిక వసతుల కల్పన పనులను ప్రారంభిస్తాం. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మురిగి నీటి శుద్ధీకరణ ప్లాంటు కూడా నెలకొల్పుతాం. ప్రస్తుతం డీపీఆర్లు రూపొందించే పనుల్లో ఉన్నాం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పిన తర్వాత ఆయా ప్రాంతాల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. స్థానిక యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. మంచి నాణ్యమైన ఆహారం ప్రజలకు అందుతుంది.
అజ్మీరా స్వామి, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ (కరీంనగర్)