లండన్, ఏప్రిల్ 10: కరోనా వైరస్ ప్రపంచమంతటా ధనిక, పేద దేశాలపై ఒకేవిధమైన ప్రభావం కలిగిస్తూ తీవ్ర భయాందోళనకు కారణమవుతున్నప్పటికీ.. ఆ వైరస్పై యుద్ధంలో మాత్రం అన్ని దేశాలూ కలిసికట్టుగా పోరాడని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా, కరోనా టీకాల వినియోగంలో ధనిక, పేద దేశాల మధ్య అంతరం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. సంపన్నదేశాల్లో ప్రతీ నలుగురిలో ఒకరికి టీకా అందుతుంటే.. పేద దేశాల్లో 500 మందిలో ఒక్కరికి కూడా టీకా లభించటం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్ అధనోమ్ చెప్పటం.. టీకా వినియోగంలో ఏ స్థాయిలో ఆర్థిక అంతరాలు ప్రభావం చూపుతున్నాయో తెలుపుతున్నది. ధనిక దేశాలు టీకాల ఉత్పత్తిని, సరఫరాను నియంత్రిస్తున్నాయి. తమ ప్రస్తుత, భవిష్యత్తు అవసరాల కోసం ముందే కొనిపెట్టుకొంటున్నాయి. ఫలితంగా.. పేదదేశాలకు టీకాలు అందజేయడానికి ఐక్యరాజ్యసమితి తలపెట్టిన ‘కోవాక్స్’ కార్యక్రమం ఆచరణలో అనుకొన్న ఫలితాలను ఇవ్వడం లేదు. కొన్ని దేశాల్లో ఉత్పత్తి అవుతున్న కరోనా టీకాలను ఆ దేశాలే వినియోగించుకొంటున్నాయి. ఎగుమతులపైన ఆంక్షలు విధిస్తున్నాయి.
‘కోవాక్స్’ ద్వారా 92 దేశాలకు టీకాలను సరఫరా చేస్తున్నారు. ఇప్పటి వరకు 3.8 కోట్ల డోసులను పంపిణీ చేశారు. దాదాపు 60 దేశాల్లో మొదటి డోసు వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఇప్పుడు ఈ దేశాలకు కొత్త చిక్కు వచ్చింది. మొదటి డోసు తీసుకొన్నవారికి సకాలంలో రెండో డోసు ఇవ్వడానికి టీకాలు అందుబాటులో లేవు. టీకాలు ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయాదేశాలు సొంత వినియోగానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీనివల్ల జూన్ చివరి దాకా వ్యాక్సిన్లు అందే పరిస్థితి లేదు. మనదేశంలో పుణెలో ఉన్న సీరమ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎగుమతులు నిలిపివేయాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయం కూడా కోవాక్స్పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. టీకాల సరఫరాపై అనిశ్చితి నెలకొనడంతో అనేక దేశాలు కోవాక్స్ కార్యక్రమంపై నమ్మకం కోల్పోతున్నాయి.
వ్యాక్సిన్ పొందే అంశంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అసమానతలు ఉన్నాయని డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. ధనిక దేశాల్లో ప్రతీ నలుగురిలో ఒకరు టీకా పొందితే.. పేద దేశాల్లో 500 మందిలో కనీసం ఒక్కరికి కూడా టీకా అందటంలేదని అన్నారు. కోవాక్స్ను కాదని కొన్ని దేశాలు ఇతర దేశాలకు నేరుగా టీకాలను విరాళం ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. వ్యాక్సిన్ పంపిణీలో అసమానతలకు ఇది కూడా ఓ కారణమన్నారు.