ఇస్లామాబాద్: రాజకీయ అస్తిరత నెలకొన్న పాకిస్థాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడి నాలుగు రోజులు కాలేదు. అప్పుడే ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ను సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు పెరగడం, రూపాయి మారకపు విలువ క్రమంగా పడిపోతుండటంతో దేశంలో డీజిల్ ధరలు పెంచక తప్పని పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నది. ఒకవేళ పెంచినట్లయితే ప్రజలపై మరో రూ.60.54 భారం పడనుంది. దీంతో లీటరు పెట్రోల్ ధర రూ.204.69కి చేరుతుంది. పాక్ చరిత్రలో డీజిల్ ధర ఇదే అత్యధికం కానుంది.
అయితే ప్రభుత్వం ముందు మరో ప్రత్యామ్నాయం కూడా ఉన్నది. డీజిల్ ధరలు పెంచొద్దంటే నవాజ్ సర్కారు రూ.30 బిలియన్ల సబ్సిడీ భారాన్ని భరించాల్సి ఉంటుంది. అదికూడా వచ్చే 15 రోజులకు మాత్రమే కావడం గమనార్హం.
గత ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై ఏప్రిల్ నెల మొదటి 15 రోజులకు రూ.30 బిలియన్ల సబ్సిడీ ఇస్తామని ప్రకటించింది. దీంతో చమురు ధరలు పెరగకుండా స్థిరంగా ఉన్నాయి. అయితే ఆ గడువు రేపటితో ముగియనుంది. ఒకవేళ సబ్సిడీని కొనసాగించినట్లయితే కొత్త ప్రభుత్వం ఏప్రిల్ నెలకు సంబంధించిన మొత్తం రూ.60 బిలియన్లు భరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నవాజ్ ప్రభుత్వం డీజిల్ ధరలను పెంచుతుందా? లేదా.. సబ్సిడీలను భరిస్తుందా? అనేది వేచిచూడాల్సిందే.