వాషింగ్టన్, అక్టోబర్ 15: రూపాయి విలువ పతనంకావడం ఆందోళనకరమైన అంశమేనని, ప్రత్యేకింది అధిక దిగుమతులపై ఆధారపడే భారత్కు ఇబ్బంది కలుగుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ దినేశ్ ఖారా చెప్పారు. డాలర్ ఇండెక్స్ బలపడుతున్నందునే రూపాయి విలువ తగ్గుతున్నదని, అయినా పలు వర్థమాన దేశాల కరెన్సీలకంటే రూపాయి పతనం తక్కువగానే ఉన్నదన్నారు. ఐఎంఎఫ్ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు వాషింగ్టన్ వచ్చిన ఎస్బీఐ చైర్మన్ పీటీఐ ప్రతినిధితో మాట్లాడుతూ ‘వర్థమాన దేశాల్లో మన కరెన్సీకంటే మెరుగ్గా కమోడిటీలు ఉత్పత్తి చేసే దేశమైన ఇండోనేషియా, బ్రెజిల్ కరెన్సీలు ఉన్నాయి. ఈ రెండు దేశాల కరెన్సీలే భారత్ రూపాయికంటే బాగున్నాయి’ అన్నారు. మన ఆర్థిక వ్యవస్థకు భారీ దిగుమతులు అవసరమైనందున, రూపాయి క్షీణత చాలా ఆందోళనకరమేనన్నారు. కానీ డాలర్ బలపడుతూ ఉంటే రూపాయి ఎంతవరకూ నిలబడుతుందంటూ ప్రశ్నించారు. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితులు, పరిణామాల రీత్యా చూస్తే రూపాయి ఇతర గ్లోబల్ కరెన్సీలకంటే మెరుగ్గానే ఉన్నదన్నారు. రూపాయి ఒడిదుడుకుల్ని తగ్గించడానికి విదేశీ కరెన్సీ మార్కెట్లో రిజర్వ్బ్యాంక్ అప్పుడప్పుడూ జోక్యం చేసుకుని, డాలర్లను విక్రయిస్తుందని దినేశ్ ఖారా తెలిపారు.