Turkey-Syria Earthquake | తుర్కియే (Turkey), సిరియా (Syria) దేశాల్లో మరణ మృదంగం కొనసాగుతోంది. ఆ రెండు దేశాల సరిహద్దుల్లో గత వారం సంభవించిన భారీ భూకంపంలో (Massive Earthquake) మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. రెండు దేశాల భూభాగాల్లో కలిపి మొత్తం 45వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ఒక్క తుర్కియేలోనే 39,672 మంది ప్రాణాలు కోల్పోగా.. సిరియాలో 5,800 మంది మృత్యువాత పడ్డారు.
భారీ భూకంపం ధాటికి రెండు దేశ భూభాగాల్లో వేల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద అనేక మంది ప్రజలు చిక్కుకుపోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ గడ్డ కట్టే వాతావరణం కారణంగా .. సహాయక చర్యలు అతికష్టంగా సాగుతున్నాయి. మరోవైపు భూకంపం సంభవించి 12 రోజులు గడవడంతో శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడటం కష్టంగా మారింది. అయితే, కొందరు మాత్రం ఇంకా సురక్షితంగా బయటపడుతుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
తాజాగా తుర్కియేలో భూకంపం శిథిలాల కింద చిక్కుకున్న ఓ 45 వ్యక్తిని రెస్క్యూ సిబ్బంది గుర్తించారు. భూకంపం సభవించి సుమారు 278 గంటల తర్వాత.. అంటే దాదాపు 12 రోజుల తర్వాత కూడా ఓ ఆ వ్యక్తి శిథిలాల కింద సజీంగా ఉన్నాడు.
మరోవైపు, రెండు భూభాగాల్లో కలిపి సుమారు 200 ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తుర్కియే ఉపాధ్యక్షుడు ఫువాట్ ఓకటే తెలిపారు. గురువారం కూడా ముగ్గుర్ని రక్షించారు. దాంట్లో 14 ఏళ్ల పిల్లోడు కూడా ఉన్నాడు. భూకంపం వల్ల 11 ప్రావిన్సుల్లో నష్టం కలగా.. దాంట్లో ఆదనా, కిలిస్, సనిలుర్ఫా ప్రావిన్సుల్లో రెస్క్యూ ఆపరేషన్ ముగిసినట్లు తుర్కియే అధికారులు తెలిపారు.