ఊహించిన దానికన్నా ముందే దేశంలో కొవిడ్ థర్డ్వేవ్ మొదలైపోయింది! అత్యంత వేగంగా విస్తరించే ఒమిక్రాన్.. తన ప్రతాపం చూపుతున్నది. వారం రోజుల్లోనే కేసుల సంఖ్య ఆరు రెట్లు పెరిగింది. డిసెంబర్ 28న దేశంలో 6,358 కేసులు నమోదుకాగా, మంగళవారం ఒక్కరోజులోనే 37 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన ఏడు రోజుల్లో నమోదైన కేసుల సరళిని విశ్లేషిస్తే, దేశంలో ఇప్పటికే థర్డ్వేవ్ (మూడో ఉద్ధృతి) మొదలైందని కొవిడ్-19 కార్యదళం ఎన్టీఏజీఐ చీఫ్ డాక్టర్ ఎన్కే అరోరా తెలిపారు. ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాల్లో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని, డెల్టా స్థానంలో ఒమిక్రాన్ కేసులు పెద్దఎత్తున నమోదవుతున్నాయన్నారు. అమెరికా, బ్రిటన్లో కూడా తొలుత ఇలాంటి పరిస్థితులే తలెత్తినట్టు గుర్తుచేశారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నమోదైన మొత్తం కేసుల్లో 50 శాతం కేసులు ఒమిక్రాన్వే అన్నారు. అయితే, దేశంలో వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతుండటం, వైద్య సదుపాయాలు పెద్ద మొత్తంలో అందుబాటులోకి రావడం వల్ల అంతగా భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 37,379 కేసులు, 124 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,49,60,261కి, మరణాలు 4,82,017కి చేరుకొన్నాయి. కొత్తగా 192 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దీంతో ఆ కేసుల సంఖ్య 1,892కి చేరింది.
ముంబై, ఢిల్లీలో విజృంభణ
ఢిల్లీలో ఒక్కరోజులోనే 5,481 కేసులు బయటపడ్డాయి. పాజిటివిటీ రేటు 8.37 శాతానికి పెరిగింది. దీంతో వైరస్ నియంత్రణకు వారాంతాల్లో కర్ఫ్యూ విధించనున్నట్టు అధికారులు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే విధులను నిర్వహించాలని ఆదేశించారు. ఢిల్లీలోని ప్రభుత్వ దవాఖానల్లో వైద్యులకు సెలవులు రద్దు చేశారు. ముంబైలో ఒక్కరోజులోనే 10,860 కేసులు వెలుగుచూశాయి. కేసుల సంఖ్య 20 వేలు దాటితే లాక్డౌన్ విధిస్తామని ముంబై మేయర్ కిశోర్ పెడ్నేకర్ తెలిపారు.
పంజాబ్లో విద్యాసంస్థలు మూత
రాత్రి 10-5 గంటల మధ్య కర్ఫ్యూ విధిస్తున్నట్టు పంజాబ్ ప్రకటించింది. విద్యాసంస్థలను మూసివేస్తున్నట్టు వెల్లడించింది. 50 శాతం సామర్థ్యంతో సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, బార్లకు అనుమతి ఉంటుందని ప్రకటించింది. జనవరి 15 వరకు ఈ నిబంధనలు కొనసాగుతాయని తెలిపింది.
‘ఒమిస్యూర్’తో నేరుగా ఒమిక్రాన్ గుర్తింపు
జన్యుక్రమ విశ్లేషణ అవసరం లేకుండా, పరీక్ష సమయంలోనే నేరుగా ఒమిక్రాన్ వేరియంట్ను గుర్తించేందుకు ‘ఒమిస్యూర్’ అనే కిట్ను అభివృద్ధి చేసినట్టు టాటా మెడికల్ అండ్ డయగ్నస్టిక్స్(ఎండీ) రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హెడ్ వి రవి మంగళవారం వెల్లడించారు. ఈ కిట్ ద్వారా ఆర్టీపీసీఆర్ పరీక్ష సమయంలో ముక్కు లేదా నోటి నుంచి తీసుకున్న నమూనాల్లో ఒమిక్రాన్ను గుర్తించవచ్చని పేర్కొన్నారు. ఒమిక్రాన్తో పాటు ఇప్పటి వరకు బయటపడిన ఇతర వేరియంట్లను కూడా ఈ కిట్ గుర్తిస్తుందని చెప్పారు. ఈ కిట్కు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) డిసెంబర్ 30న ఆమోదం తెలిపింది.
అగ్రరాజ్యం విలవిల
న్యూయార్క్: కరోనా పంజాతో అమెరికా కకావికలమవుతున్నది. సోమవారం రికార్డు స్థాయిలో 10 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఒక దేశంలో ఒక్క రోజులో ఈ స్థాయి కేసులు రికార్డవ్వడం ఇదే తొలిసారి. సుమారు లక్ష మంది దవాఖానల్లో చేరారు. 20 వేల మంది ఐసీయూల్లో చికిత్స తీసుకొంటున్నారు. రోగుల తాకిడి అంతకంతకూ పెరుగుతుండటంతో వైద్య వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి రావొచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల కారణంగానే కేసుల సంఖ్య మూడు రెట్లు పెరిగినట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. డెల్టా ప్రభావంతో గత జనవరిలో అమెరికాలో ఒక్కరోజులో సగటున 3 లక్షల కేసులు నమోదయ్యాయి.
బ్రిటన్లో తొలిసారిగా 2 లక్షలకుపైగా కేసులు
బ్రిటన్పై కరోనా పంజా విసురుతున్నది. మహమ్మారి మొదలైనప్పటి నుంచి తొలిసారిగా మంగళవారం ఒక్కరోజే 2 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి.
దక్షిణాఫ్రికాలాగే భారత్లోనూ..
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ తొలిసారిగా వెలుగుచూసిన దక్షిణాఫ్రికాలో ఆ వేరియంట్ కారణంగా నాలుగో వేవ్ తీవ్రరూపం దాల్చింది. గత కొన్ని రోజులుగా అక్కడ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. సరిగ్గా భారత్లో కూడా ఇలాంటి పరిస్థితులే వస్తాయని డాక్టర్ అరోరా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వైరస్ పెరుగుతున్నది. మరికొద్ది రోజుల్లోనే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అంచనా వేశారు. వ్యాక్సినేషన్, సహజసిద్ధంగా రోగనిరోధక శక్తి వృద్ధి, ఆంక్షలు విధించడమే దక్షిణాఫ్రికాలో కేసుల తగ్గుదలకు కారణమని అంచనా.
ఫ్రాన్స్లో కొత్త వేరియంట్
పారిస్: ఒమిక్రాన్తో ప్రపంచదేశాలు కుదేలవుతుంటే ఫ్రాన్స్లో మరో కొత్త వేరియంట్ వెలుగుచూసింది. ‘బీ.1.640.2’గా పిలిచే దీనికి ‘ఐహెచ్యూ’ వేరియంట్గా పరిశోధకులు పేరు పెట్టారు. ఆఫ్రికా దేశం కామెరూన్ నుంచి దక్షిణ ఫ్రాన్స్కు ఇటీవల వచ్చిన కనీసం 12 మందిలో ఈ వేరియంట్ను గుర్తించినట్టు తెలిపారు. 46 ఉత్పరివర్తనాలు కలిగిన ఈ వేరియంట్ లక్షణాలు, తీవ్రతను ఇప్పటికిప్పుడు చెప్పలేమన్నారు. అయితే, ఒమిక్రాన్ కంటే దీని తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.